సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): తల్లిపాలను మించిన యాంటిబయోటిక్స్ లేవని నిలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి అన్నారు. బుధవారం నిలోఫర్ హాస్పిటల్లో నిర్వహించిన వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ను వైద్యసిబ్బందితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా డా.ఉషారాణి మాట్లాడుతూ శిశువుకు పుట్టిన వెంటనే ముర్రుపాలు అందించడం, ఆ తరువాత కనీసం మూడు సంవత్సరాల పాటు తల్లిపాలు పట్టడం తప్పనిసరని తెలిపారు. దీని వల్ల బిడ్డ శరీరంలో జీవితాంతం బలమైన యాంటిబయోటిక్స్ ఏర్పడతాయని, ఫలితంగా తరచూ వ్యాధుల బారిన పడకుండా తల్లిపాలు బిడ్డను కాపాడుతాయని అన్నారు. అనంతరం ఇండియన్ అకాడమి ఆఫ్ పిడియాట్రిక్స్తో కలిసి నర్సులు, డాక్టర్లకు తల్లిపాలపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం కల్పించిన మెటర్నిటీ బెనిఫిట్స్ చట్టం, ఐఎంఎస్ చట్టం, మా ప్రోగ్రామ్లపై చర్చించారు. ఈనెల 4న చంటిబిడ్డల తల్లుల కోసం ప్రముఖ హిప్నోథెరపిస్ట్ పద్మా కమలాకర్తో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.