Cold Weather | సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా గత మూడు నాలుగు రోజుల నుంచి వణికిస్తున్న చలి.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఈ చలి వల్ల వివిధ రకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. చలి ప్రభావంతో మరోసారి సీజనల్ వ్యాధులు పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం కేసులు పెరుగుతున్నాయి. అయితే, చలి వల్ల చిన్నపిల్లలు న్యుమోనియా వంటి వ్యాధులకు గురయ్యే అవకాశం ఉన్నట్లు వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
వర్షాకాలం, చలికాలంలో సీజనల్ వ్యాధులు రావడం సర్వసాధారణం. వర్షాలు తగ్గిన తరువాత కొంత తగ్గుముఖం పట్టిన సీజనల్ వ్యాధులు.. కొన్ని రోజులుగా పెరిగిన చలి తీవ్రత కారణంగా మరోసారి పెరుగుతున్నాయి. చల్లదనం వల్ల జలుబు, జ్వరం వంటి కేసులు ఎక్కువగా వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటు వైరల్ ఫీవర్ కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయని నిలోఫవర్ వైద్యులు తెలిపారు. ఫలితంగా రోగుల తాకిడి పెరిగినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.
కొన్ని రోజులుగా వాతావరణంలో ఏర్పడిన మార్పులు, ఒక్కసారిగా పెరిగిన చలి ప్రభావంతో చిన్న పిల్లల్లో జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. వారం రోజులుగా చాలా మంది పిల్లలు ఈ సమస్యలతో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలకు క్యూ కడుతున్నారు. నిలోఫర్ దవాఖానలో సైతం జలుబు, దగ్గు, జ్వరం.. సంబంధించిన ఓపీ కూడా పెరిగినట్లు దవాఖాన వర్గాలు తెలిపాయి. సాధారణ రోగుల కంటే సుమారు 20 శాతం వరకు జలుబు, దగ్గు, జ్వరం కేసులు పెరిగినట్లు నిలోఫర్ వర్గాలు వెల్లడించాయి.
చలికాలంలో చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. చలికాలం వచ్చిందంటే సాధారణంగా చాలా మంది పిల్లల్లో జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు కనిపిస్తుంటాయి. ప్రతి సీజన్లో నిలోఫర్కు సైతం ఈ లక్షణాలతో వచ్చే కేసుల సంఖ్య సాధారణ రోజుల కంటే 15 నుంచి 20 శాతం పెరుగుతుంది. చలికాలంలో ఇది సాధారణమే అయినప్పటికీ చిన్నపిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా నవజాత శిశువుల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. శిశువులను వెచ్చని వాతావరణంలో ఉంచాలి. చేతులకు గ్లౌస్లు, కాళ్లకు సాక్సులు, తలకు టోపీ వంటివి ధరించడమే కాకుండా.. శిశువుల గది వెచ్చగా ఉండే విధంగా జాగ్రత్త పడాలి.
శిశువులను తీసుకుని చలి వాతావరణంలో బయటకు వెళ్లకపోవడం మంచిది. అధిక చలి వల్ల శిశువులు హైపర్ థెర్మియా బారిన పడే ప్రమాదం ఉంది. దీని బారిన పడకుండా ఉండాలంటే శిశువులకు తరచూ తల్లి పాలు పట్టాలి. చలి కాలంలో.. ముఖ్యంగా నవజాత శిశువులు, తక్కువ బరువు, నెలలు నిండకుండా జన్మించిన శిశువులను జాగ్రత్తగా చూసుకోవాలి. వీరికి చలి వల్ల ఎక్కువ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి కేసులను ఎదుర్కొనేందుకు, మెరుగైన వైద్యం అందించేందుకు నిలోఫర్లో ప్రత్యేకంగా కంగారు మదర్ కేర్ (కేఎంసీ) వార్డును అందుబాటులో ఉంచాం. దీని వల్ల బేబీ శరీరం సహజంగా వెచ్చబడుతుంది. ప్రస్తుతం నిలోఫర్లో 20 పడకలతో కేఎంసీ వార్డు అందుబాటులో ఉంది. సేవలను అందిస్తున్నాం.
– డాక్టర్ ఉషారాణి, సూపరింటెండెంట్, నిలోఫర్ హాస్పిటల్