హైదరాబాద్ : తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్టంగా నమోదవుతున్నాయి. తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి వణికిస్తోంది.
హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదు అవుతున్నాయి. శనివారం తెల్లవారుజామున శేరిలింగంపల్లిలో 12.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గత కొద్ది రోజుల నుంచి నగరంలో రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి.
శనివారం ఉదయం హైదరాబాద్లో 15.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక ఆది, సోమవారాల్లో కూడా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాత్రి సమయంలో 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. నగర శివార్లలో 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది.
ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కూడా 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్నది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది.