మేడ్చల్, మార్చి 21(నమస్తే తెలంగాణ)/ మేడ్చల్ కలెక్టరేట్ :మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోయిన్పల్లి నుంచి మెదక్ జిల్లా శివారులోని కాళ్లకల్ వరకు విస్తరిస్తున్న 27 కిలోమీటర్ల జాతీయ రహదారి (ఎన్హెచ్44) విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎన్హెచ్44 విస్తరణ పనులపై కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని బోయిన్పల్లి నుంచి కాళ్లకల్ వరకు ఆరు లేన్లతో జాతీయ రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, తాసీల్దార్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విడుతల వారీగా క్రమబద్ధీకరణ రుసుము వసూలు
జిల్లాలో 59, 118 జీఓ కింద వచ్చిన దరఖాస్తులను మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ అమోయ్కుమార్ అన్నారు. నిబంధనల ప్రకారం ఇప్పటికీ ఇంకా పూర్తి కాని దరఖాస్తులు ఉన్నాయని, ఈ నెల చివరి నాటికి వాటిని పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. 59జీఓ కింద అర్హులుగా గుర్తించిన దరఖాస్తుదారుల నుంచి విడుతల వారీగా క్రమబద్ధీకరణ రుసుము వసూలు చేయాలని, మొదటి విడుత సేకరణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. 118 జీఓకు సంబంధించి ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన విధులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఆర్డీఓలు, ఏసీపీ రామలింగరాజు, మున్సిపల్ కమిషనర్లు, తాసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.