హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : మార్కెట్, పరిశ్రమ అవసరాల మేరకు కోర్సులను ఆధునికీకరించడంలో భాగంగా పలు కోర్సుల సిలబస్ను సమూలంగా మార్చినట్టు జేన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. బీటెక్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సుల సిలబస్ను సమూలంగా మార్చామని పేర్కొన్నారు.
కొత్త సిలబస్ రెండు వారాల్లో అమల్లోకి వస్తుందని వెల్లడించారు. శుక్రవారం జేఎన్టీయూహెచ్లో తనను కలిసిన విలేకరులతో ఆయన ముచ్చటించారు. ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫ్యాకల్టీ నియామకానికి రాష్ర్టాన్ని 20 క్లస్టర్స్గా విభజించి ఎంపిక ప్రకియ చేపట్టామన్నారు. ఈ విద్యాసంవత్సరంలో డిపార్ట్మెంట్కు 1+2+4 రేషియోలో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అధ్యాపకులు ఉండేలా చర్యలు తీసుకొంటామని కట్టా నర్సింహారెడ్డి వెల్లడించారు.
ఈ విద్యాసంవత్సరం నుంచి జేఎన్టీయూ కూకట్పల్లి, సుల్తాన్పూర్లో కొత్తగా బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సును ప్రవేశపెడుతున్నామని వీసీ తెలిపారు. ఏడాది ఫీజు రూ.లక్షగా నిర్ణయించామన్నారు. ఈ ఏడాది వనపర్తిలో కొత్తగా ఆరు కోర్సులతో ఇంజినీరింగ్ కాలేజీని ప్రారంభించామన్నారు. ఈ కాలేజీకి 45 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు.