సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): వీకెండ్లో లాంగ్ జాలీ ట్రిప్పు.. సరదాగా యువత బైక్లపై దూరంగా ఉన్న పర్యాటక, నచ్చిన ప్రాంతాలకు వెళ్తుంటారు.ఇంట్లో వారు కూడా అడ్డుచెప్పరు. ఉత్సాహంగా జర్నీ చేస్తారు. ఇప్పుడీ జాలీ ట్రిప్పు అడ్డదారులు తొక్కుతోంది. యువతను పెడదారి పట్టిస్తున్నది. కొంతమంది యువత వీకెండ్లో జాలీ ట్రిప్పుల పేరుతో దూరప్రాంతాలకు వెళ్తున్నారు. ఇటు ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా.. అటు తనిఖీల్లో పట్టుబడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈజీగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. గంజాయికి అలవాటుపడిన యువత.. ఆ తర్వాత తాను వాడుతూ.. ఇతరులకు విక్రయిస్తున్నారు. ఈజీగా డబ్బులు సంపాదిస్తున్నారు. పలు కేసుల విచారణలో ఈ విషయం బయటపడటంతో.. ఈ దందాను ఎక్కడికక్కడే కట్టడి చేసేందుకు మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు గట్టి నిఘా పెట్టారు. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వారిని గుర్తించి పట్టుకుంటున్నారు. టూర్ల పేరుతో బైక్లు, కార్లపై లాంగ్ జర్నీ చేస్తున్న పిల్లలను తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇటీవల పట్టుబడిన నాగోల్కు చెందిన ముఠాలో ఆరుగురు విద్యార్థులున్నారు. దీంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.
నెలకో ట్రిప్పు..
రాచకొండ ఎస్వోటీ పోలీసులు ఇటీవల గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ ముఠాను అరెస్ట్ చేశారు. అందులో బీటెక్ విద్యార్థులు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువకులే ఉన్నారు. విశాఖపట్టణానికి బైక్లపై వెళ్తున్న వీరు.. ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి విక్రయించే వారిని పరిచయం చేసుకుంటున్నారు. నెలకోసారి ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి గంజాయితో వస్తున్నారు.
ఇటీవలే ఎనిమిది మంది 10 కిలోల గంజాయితో వస్తూ.. ఎల్బీనగర్ ఎస్వోటీ బృందానికి పట్టుబడిన విషయం తెలిసిందే.
తనిఖీ పోలీసుల కళ్లుగప్పి..
హైదరాబాద్లో గంజాయి విక్రయాలు పూర్తిగా తగ్గిపోయాయి. మంగళ్హాట్, ధూల్పేట్ ప్రాంతాల్లో కూడా పోలీసులు ఉక్కుపాదం మోపడంతో పూర్తిగా అక్కడ విక్రయాలు తగ్గిపోయాయి. అయితే, గంజాయి డిమాండ్ మాత్రం తగ్గలేదు. దీనిని ఆసరాగా చేసుకున్న విద్యార్థులు కొందరు.. అక్కడ గంజాయి సరఫరా చేయడం ప్రారంభించినట్టు పోలీసులు గుర్తించారు. ఇందుకు కొంతమంది యువత లాంగ్ ట్రిప్పుల పేరుతో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి గంజాయితో వస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న వాహనంపై తప్పనిసరిగా ఇద్దరు ఉంటారు. మార్గమధ్యంలో ఎవరైనా పోలీసులు తనిఖీ చేస్తే, బైక్పై ఉన్న ఇద్దరిలో ఓ వ్యక్తి గంజాయితో దూరంగా దిగిపోయి. అక్కడే ఆగిపోతాడు. బైక్ నడిపిస్తున్న వ్యక్తి ఎవరికీ అనుమానం రాకుండా ముందుకు వెళ్లిపోతాడు. దూరంగా దిగిపోయిన వ్యక్తి పోలీసుల తనిఖీలు పూర్తయిన వెంటనే బైక్ నడిపిస్తున్న వ్యక్తిని కలుసుకుంటాడు. ఇలా పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కొత్త పంథాలో యువకులు గంజాయిని ఏపీ నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారు.