సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : వాహనదారులకు నష్టం చేకూర్చేలా అమలు చేస్తున్న రవాణా శాఖ నిర్ణయాలపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. వాహనదారుల జేబులు ఖాళీ చేయడమే లక్ష్యంగా ఆర్టీఏ అడుగులు వేస్తున్నది. మొన్నటి వరకు లైఫ్ ట్యాక్స్, సర్వీస్ చార్జీ, ఫ్యాన్సీ నంబర్ల ధరలు పెంచి తాజాగా సామాన్యులు తత్కాల్లో వెయ్యి రూపాయల చెల్లింపుతో అందుబాటులో ఉన్న నచ్చిన నంబర్ను తీసుకునే సేవను ఇప్పుడు రూ.6 వేలు చేశారు.
గతంలో ఫ్యాన్సీ నంబర్ మినహాయించి ఏ రోజుకు ఆ రోజు అందుబాటులో ఉన్న 150 నంబర్లలో నచ్చిన నంబర్ దక్కించుకోవడానికి వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉండేది. ఉన్న వాటిలోనే ఎంపిక చేసుకునే వీలుండేది. ఆ నంబర్కు ఎటువంటి బిడ్డింగ్ లేకపోతే సదరు వాహనానికి నంబర్ అధికారులు కేటాయించేవారు. కానీ ఈ తరహా సేవను ప్రస్తుతం ఆర్టీఏ నిలిపివేసింది. ఫ్యాన్సీ నంబర్లు కానీ వాటిని కూడా ఎంపిక చేసుకున్నా.. అధిక మొత్తం చెల్లించాల్సి వస్తున్నది. ఫోర్ వీలర్లకు రూ.6వేలు, ద్విచక్రవాహనాలకు రూ.3 వేలు వసూలు చేస్తున్నారు.
అంతేకాదు డబ్బులు చెల్లించినా.. మళ్లీ బిడ్డింగ్లో ఎవరైనా వస్తే వేలంలో పాల్గొనాల్సి వస్తుంది. అప్పుడు 6 వేలకు అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ తత్కాల్ రిజర్వేషన్ నంబర్ల సేవలను ఆర్టీఏ ఎత్తివేయడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవాణా శాఖ అధికారులు ఇటీవల తీసుకొచ్చిన మార్పులతో ఫ్యాన్సీ నంబర్ల ధరలు భారీగా పెరగడంతో వాహనదారుల నుంచి స్పందన కరువైంది. గతంలో 9999 దక్కించుకోవాలంటే రూ.50వేల ఫీజు చెల్లించి ఆపై బిడ్డింగ్లో పాల్గొనేవాళ్లు. కానీ ఇప్పుడు ఈ 9999 నంబర్ను దక్కించుకోవాలంటే రూ.1.50 లక్షల ఫీజు చెల్లించాల్సిందే.
ఆ తర్వాత బిడ్డింగ్లో పాల్గొనాలి. కాగా, గతంలో 1,9 నంబర్లకు రూ.50వేలు ఉంది. ఇప్పుడు లక్ష రూపాయల ఫీజు ఉంది. 3333, 4444, 5555, 7777, 8888 రూ.30వేలు గతంలో ఉంది. ప్రస్తుతం రూ. 50 వేలు ఉంది. ఇలా ఫ్యాన్సీ నంబర్ల ఫీజులు ఇష్టానుసారంగా పెంచేయడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ఫ్యాన్సీ నంబర్లపై ఆసక్తి తగ్గుతున్న పరిస్థితుల్లో మరోవైపు ఫీజులు పెంచడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులకు కావాల్సిన నంబర్ను కూడా ధరలు పెంచేసి దూరం చేయడం ఏంటని వాహనదారుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.