కవాడిగూడ/ముషీరాబాద్, జనవరి 9: మెరుగైన సౌకర్యాలతో గ్రంథాలయాలకు పూర్వవైభవం తీసుకువస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సౌకర్యాలు లేక నిరాదరణకు గురైన గ్రంథాలయాలను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దశలవారీగా అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గంలో రూ 6.32 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను స్థానిక శాసనసభ్యుడు ముఠా గోపాల్తో కలిసి ప్రారంభించారు. ‘మనబడి-మన బస్తీ’ కార్యక్రమం కింద రూ.4.32 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల పునర్నిర్మాణ పనులు, కవాడిగూడ బండమైసమ్మనగర్, రాంనగర్ డివిజన్ బాకారంలో రూ.2కోట్ల వ్యయంతో చేపట్టనున్న గ్రంథాలయ భవన నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంతో మందికి విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలకు గొప్ప చరిత్ర ఉందని, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా క్రమంగా నిరాదరణకు గురవుతూ వచ్చాయన్నారు.
తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. నగరంలో ఉన్న 82 గ్రంథాలయాలు ఉండగా.. వాటిలో శిథిలావస్థ, అద్దె భవనాల్లో కొనసాగుతున్న వాటి స్థానం లో రూ.8కోట్లతో శాశ్వత భవనాలను నిర్మించినట్లు చెప్పా రు. గ్రంథాలయాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం స్టడీ మెటీరియల్స్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వేలాది రూపాయలు ఖర్చుపెట్టి ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు వెళ్లేస్థోమత లేని వారికి గ్రంథాలయాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయన్నారు.
గ్రంథాలయాల్లో ఖాళీగా ఉన్న 189 ఉద్యోగ ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ‘మన బడి-మన ఊరు’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 9వేల పాఠశాలల అభివృద్ధి, నూతన భవనాల ఏర్పాటుకు రూ.6800 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ విజ్ఞప్తి మేరకు ముషీరాబాద్లో జూనియర్ కళాశాల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎమ్మెల్యే గోపాల్ అభ్యర్ధన మేరకు సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా పాఠశాలల నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని కోరారు.
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. ముషీరాబాద్లో అత్యధిక శాతం బాలికల డ్రాప్ అవుట్స్ ఉన్నాయని, జూనియర్ కళాశాల, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేయాలని మంత్రి తలసానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్, నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, కవాడిగూడ, రాంనగర్ డివిజన్ల కార్పొరేటర్ రచనశ్రీ, రవిచారి, జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, ముషీరాబాద్ డిప్యూటీ ఈవో చిరంజీవి, డిప్యూటీ ఐవోఎస్ స్వరూపరాణి, శ్రీనివాస్ రాజు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎంఎన్ శ్రీనివాసరావు, ముఠా జయసింహ, ఎడ్ల హరిబాబు యాదవ్, ముషీరాబాద్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.నరేందర్ యాదవ్, రతన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.