Hyderabad | సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వంలో బిల్డర్లకు కష్టాలు తప్పడం లేదు. నిర్మాణ రంగంలో అనుమతుల కోసం అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి వస్తోంది. కోట్లాది రూపాయల పెట్టుబడులతో నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి అనుమతులు సకాలంలో రాక తీవ్ర నిరాశే ఎదురవుతున్నది. నిర్మాణ రంగంలో భవన నిర్మాణ అనుమతులు పారదర్శకంగా, సత్వరమే పొందేలా గత ప్రభుత్వం టీఎస్ బీ పాస్ పాలసీని తీసుకొచ్చింది.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే 21 రోజుల్లో భవన నిర్మాణానికి అనుమతి వచ్చినట్లుగానే భావించి నిర్మాణం చేపట్టేలా ఆ పాలసీని రూపొందించారు. అదేవిధంగా స్థల విస్తీర్ణాన్ని బట్టి అనుమతుల విషయంలో అధికారులు ఆన్లైన్లో సమర్పించిన పత్రాలను పరిశీలించి నిర్ణీత వ్యవధిలో అనుమతులివ్వాల్సి ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి తీవ్ర జాప్యం జరుగుతున్నది. ప్లానింగ్ విభాగం అధికారులు ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నా, తుది అనుమతులు ఇవ్వడంలో మాత్రం జాప్యం చేస్తున్నారు.
భవన నిర్మాణాలతో పాటు లేఅవుట్ల అనుమతులు సింహ భాగం జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోనే ఉంటాయి. వీటి పరిధిలోనే ప్రతి నెల వందలాది దరఖాస్తులు వస్తుంటాయి. 4 నెలల కాలంలో 350కి పైగా దరఖాస్తులు వచ్చాయి. అనుమతులు వచ్చినవి సింగిల్ డిజిట్కే పరిమితం కాగా, మిగతా దరఖాస్తులన్నీ అనుమతులకు నోచుకోలేదు. ముఖ్యంగా భవన నిర్మాణాలు, లేఅవుట్ల నిర్మాణాల కోసం ఆన్లైన్లో టీఎస్బీపాస్, డీపీఎంఎస్ల ద్వారా వచ్చే దరఖాస్తులను ప్లానింగ్ అధికారులు పరిశీలన చేస్తున్నారు.
కొందరు దరఖాస్తు దారులు ఫీజు చెల్లించినా.. ప్రోసిడింగ్స్ మాత్రం ఇవ్వడం లేదు. కొన్ని అర్జీలు ఇంకా పరిశీలనలో ఉన్నాయనే సమాధానం ఇస్తున్నారే తప్ప, అనుమతులు ఇవ్వడం లేదు. టీఎస్ బీపాస్ పాలసీ ప్రకారం సత్వరమే రావాల్సిన అనుమతుల్లో నెలల తరబడి జాప్యం జరుగుతుండడంతో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మాణాలు చేపట్టే బిల్డర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా ప్రాజెక్టుల్లో పనులు మొదలు పెట్టలేని పరిస్థితి క్షేత్ర స్థాయిలో నెలకొన్నది. కార్మికులకు ఉపాధి కరువైంది.
అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ప్లానింగ్ విభాగం అధికారుల చుట్టూ తిరుగుతుంటే ఇదిగో ఇచ్చేస్తున్నాం… అంటూ అధికారులు చెబుతున్నారే తప్ప అనుమతులు మాత్రం రావడం లేదు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో తీవ్ర జాప్యం నెలకొంది. అపసోపాల నడుమ టౌన్ప్లానింగ్ అధికారులు కమిషనర్కు ఫైళ్లను చేర్చుతున్నప్పటికీ సకాలంలో సంబంధిత దరఖాస్తులకు అనుమతులు పొందడం కష్ట సాధ్యంగా మారింది. కమిషనర్ పరిధిలో దాదాపు 25 దరఖాస్తులు నెలల పైబడి పరిశీలన పేరుతో పెండింగ్లో ఉన్నట్లు బిల్లర్లలో చర్చ జరుగుతున్నది.