బంజారాహిల్స్, ఫిబ్రవరి 11 : ఎముకలు కొరికే చలి.. సరిహద్దు దాటేందుకు బారులు తీరిన నేపాలీ జాతీయులు.. ముఖానికి మంకీక్యాప్లు ధరించి సరిహద్దు దాటేందుకు వస్తున్న వేలాది మందిలో దొంగల కోసం టాస్క్ఫోర్స్ పోలీసుల వెతుకులాట.. 46 గంటలుగా ఎదురుచూస్తున్న దొంగలు కళ్లముందుకు రాగానే వారిని పట్టుకునేందుకు టాస్క్ఫోర్స్ పోలీసులు ప్రయత్నించగా.. వారిని తోసుకుని భారత్ సరిహద్దు దాటి నేపాల్ వైపు ఉరుకులు పరుగులు. ముందు దొంగలు, వెనుక టాస్క్ఫోర్స్ పోలీసులు.. మరో 100 మీటర్లు దూరం పారిపోతే నేపాల్లోకి ప్రవేశిస్తామనే ధీమాతో పరుగులు పెడుతున్న దొంగలను టాస్క్ఫోర్స్ పోలీసులు వెంటపడి పట్టుకున్నారు. సినీ ఫక్కీలో చోటుచేసుకున్న ఈ చేజింగ్ సీన్ జూబ్లీహిల్స్లోని నందగిరి హిల్స్లో వ్యాపారి ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను పట్టుకునే క్రమంలో చోటుచేసుకున్నది. నగరంలో సంచలనం సృష్టించిన నందగిరి హిల్స్ చోరీ ఘటనలో ఇద్దరు నిందితులను టాస్క్ఫోర్స్ పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే..జూబ్లీహిల్స్ రోడ్ నెం 69లోని నందగిరిహిల్స్లో నివాసం ఉంటున్న రవీంద్రకుమార్ శర్మ అనే వ్యాపారి ఇంట్లో ఈనెల 5న భారీ చోరీకి పాల్పడిన ముఠాలోని సభ్యులైన భూపేందర్ షాహీ అలియాస్ భువన్ (22), కృష్ణచాంద్(23)లను పట్టుకునేందుకు మూడు టాస్క్ఫోర్స్ బృందాలు ఉత్తరప్రదేశ్లోని నేపాల్ సరిహద్దు చెక్పోస్ట్లైన గోరఖ్పూర్, రుపైదిహా, సోనాలీలకు చేరుకున్న టాస్క్ఫోర్స్ బృందాలు ఆయా ప్రాంతాలకు చేరుకున్నాయి. చోరీ అనంతరం కచ్చితంగా నేపాల్ సరిహద్దు దాటివెళ్తారన్న అంచనాతో టాస్క్ఫోర్స్ ఉన్నతాధికారులతో పాటు నగర పోలీసులు పక్కా ప్రణాళికతో చోరీ జరిగిన 24 గంటల్లోనే టాస్క్ఫోర్స్ పోలీసులను అక్కడికి పంపించారు. కాగా, 46 గంటల పాటు నేపాల్ సరిహద్దులు దాటుతున్న వేలాది మందిని సరిహద్దు భద్రతాదళం సహకారంతో క్షుణ్ణంగా పరిశీలించారు.
తమ వద్ద ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా అందరినీ గమనిస్తున్న క్రమంలో అనుకున్న విధంగానే నిందితులు భూపేందర్ షాహీ, కృష్ణచంద్ అక్కడికి చేరుకుని సరిహద్దులో గేటుదాటే సమయంలో వారిని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వారిని తోసేసి నేపాల్-భారత సరిహద్దుల మధ్యలో ఉండే ఖాళీ ప్రాంతంలో పరుగులు తీశారు. 200 మీటర్ల దూరముందే ఈ ప్రాంతం దాటితే నేపాల్లోకి ప్రవేశిస్తే వారిని పట్టుకోవడం అసాధ్యంగా మారుతుందనే ఉద్దేశంతో టాస్క్ఫోర్స్ పోలీసులు వారిని వెంబడించి సరిహద్దుకు 100మీటర్ల దూరంలో పట్టుకున్నారు.
నేపాల్ సరిహద్దులో పట్టుబడిన ఇద్దరు నిందితులతో పాటు నగరంలో పట్టుబడిన మరో ముఠా సభ్యుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఈ చోరీ స్కెచ్ మొత్తం నేపాల్కు చెందిన జిబాన్ చాంద్(35) అనే పాతనేరస్తుడు వేశాడని, గతంలో నగరానికి వచ్చి సైఫాబాద్ పీఎస్ పరిధిలోని హిల్ కాలనీలో మరో నేపాలీ దొంగతో కలిసి రూ.80లక్షల సొత్తును చోరీ చేసిన జిబాన్ చాంద్ డైరెక్షన్లోనే నందగిరి హిల్స్ చోరీ జరిగిందని తేలింది. నేపాల్లోనే ఉండి కోకాపేటలో ఉంటున్న ఏజెంట్ మదన్ సాయంతో భూపేందర్ షాహీని నందగిరి హిల్స్లో రవీంద్రశర్మ అనే వ్యాపారి ఇంట్లో పనికి కుదర్చాడని, కృష్ణచాంద్ అనే వ్యక్తితో పాటు మరికొంతమందిని చోరీ కోసం పంపించాడని తేలింది.
నేపాల్ నుంచి మత్తు మందు తీసుకువచ్చి పనిచేస్తున్న చోట సిబ్బందికి ఇచ్చి చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ చోరీలో నేరుగా పాల్గొన్న భూపేందర్ షాహీ, కృష్ణచాంద్లను నేపాల్ సరిహద్దులో అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్దనుంచి రూ.1.30 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు నిందితులు రైల్లో వెల్లకుండా పుణే దాకా బస్సులో వెళ్లి, అక్కడి నుంచి ముంబై వెళ్లినట్లు తేలింది. ముంబైలో లలిత్, జనకసాయి అనే వ్యక్తులు వీరికి ఆశ్రయం ఇచ్చారని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిదితుడు నేపాల్లోనే ఉండడంతో అతడిని అరెస్ట్ చేసేందుకు ఇంటర్పోల్ సాయం తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కాగా నేపాల్ సరిహద్దులో అత్యంత సాహసోపేతంగా నిందితులను పట్టుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులతో పాటు జూబ్లీహిల్స్ క్రైం పోలీసులను నగరపోలీసు ఉన్నతాధికారులు ప్రశంసించారు.