సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) :దొంగతనాలు చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో రకమైన నేర్పు ఉంటుంది.. ఇటీవల వరుస దొంగతనాలకు పాల్పడిన దొంగలో మరో ప్రత్యేకత ఉంది.. దొంగతనం చేసేందుకు ఇంట్లోకి వెళ్లినా ఇంట్లో కన్పించింది మాత్రమే ఎత్తుకొని బయటకు వచ్చేస్తాడు.. మద్యం, గంజాయి మత్తు ఉన్నంత వరకే దొంగతనాలు చేసి, ఆ తరువాత సైలెంట్ అవుతాడు.. తాళం వేసిన ఇండ్లు కన్పిస్తే అన్ని వరుసగా తాళాలు పగులగొడుతూ వెళ్తాడు.. టు లెట్ బోర్డున్నా ఆ ఇండ్ల తాళాలు పగులగొట్టి ఇంట్లో వెతుకుతాడు.. పోలీసులకు చిక్కాడంటే తాను ఫలాన దొంగతనాలు చేశానంటూ చేసిన నేరాలు ఒప్పుకుంటూ జైలుకు వెళ్లిపోతాడు.. జైల్లో కూడా ఎక్కువ రోజులే గడుపాలని చూసుకుంటాడు.. నేరాలు చేయడం.. కుదిరినన్ని రోజులు జైల్లో ఉండడం చేస్తుంటాడు.. ఇటీవల పట్టుబడిన దార్ల నీమయ్య అలియాస్ బ్రూస్లీ దొంగతనాల తీరిది.. ఎల్బీనగర్లో వరుసగా 12 ఇండ్లు.. కూకట్పల్లిలో వరుసగా 16 ఇండ్లలో తన సహచరుడు మందుల శంకర్తో కలిసి దొంగతనాలకు పాల్పడ్డాడు.
నీమయ్య అలియాస్ బ్రూస్లీ జీవనోపాధి కోసం కర్ణాటక హుబ్లీ నుంచి హైదరాబాద్కు వచ్చి ఫతేనగర్లో నివాసముంటున్నాడు. 16వ ఏట నుంచే దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాలలో దొంగతనాలు చేస్తూ సగం జీవితం జైల్లోనే గడిపాడు. దొంగతనాలు చేస్తున్న క్రమంలోనే అనారోగ్యం బారిన పడ్డాడు. తనకంటూ కుటుంబం లేదు.. జైల్లో దొంగలను పరిచయం చేసుకోవడం, జైలు నుంచి బయటకు రాగానే దొంగతనం చేసి తిరిగి జైల్లోకి వెళ్లడం ఇతడు గత కొన్నేళ్లుగా చేస్తున్నాడు. మద్యం, గంజాయి అలవాటు ఉన్నది. సీసీ కెమెరాలు ఉండని బస్తీలనే ఎంచుకుంటాడు. ఎవరూ నివాసముండని పాత ఇళ్లనైనా.., కిరాయి కోసం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న కొత్త ఇంటినైనా.., ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన వాళ్ల ఇండ్లనైనా.. ఇలా తాళం వేసుందా అని మాత్రమే చూస్తాడు.. మత్తులో ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడుతాడు. ఎవరైనా దూరం నుంచి చూసినా.. ఆ ఇంట్లో ఉండేవారేమోననే భావన కలిగే విధంగా ఆయా ఇండ్ల వద్ద తిరుగుతుంటాడు. దొంగతనం చేసేందుకు ఇంట్లోకి వెళ్లాడంటే అతడికి ముందుగా ఏది కనిపిస్తే దానినే దొంగతనం చేస్తాడు.