సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పారిశుధ్య నిర్వహణలో స్విపింగ్ యంత్రాల వినియోగంలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కమిషనర్ రోనాల్డ్ రాస్ దృష్టి సారించారు. సీఆర్ఎంపీ రోడ్లలో స్వీపింగ్ యంత్రాలను వినియోగిస్తుండడం, ఫ్లై ఓవర్లు, ఇతర ప్రాంతాల్లో మాత్రం కార్మికులతో పనిచేయించడం, వర్షాలు కురిసిన సమయంలోనూ ఏజెన్సీలకు బిల్లులు క్లెయిమ్ చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
దీంతో స్వీపింగ్ యంత్రాల వినియోగం, బిల్లుల చెల్లింపుల విధానంపై నివేదిక ఇవ్వాలని సంబంధిత విభాగం అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు విచారణ అధికారులు రంగంలోకి దిగడంతో ఏ విధమైన అక్రమాలు బయటపడతాయోనన్న భయాందోళనలో సంబంధిత విభాగం అధికారులు ఉన్నారు. అయితే శానిటేషన్ విభాగం అదనపు కమిషనర్ ఉపేందర్రెడ్డి వ్యవహారం ఉద్యోగుల్లో చర్చకు దారి తీసింది.