మియాపూర్, మార్చి 17: దైనందిన జీవితంలో వత్తిడితో ఉండే ప్రజలకు మాల్స్, హాల్స్కు ప్రత్యామ్నాయంగా నియోజకవర్గవ్యాప్తంగా అందమైన చెరువు పరిసరాలను అందుబాటులోకి తీసుకురావటమే లక్ష్యమని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్ డివిజన్ లక్ష్మీనగర్ నాయినమ్మ కుంట చెరువు సుందరీకరణలో భాగంగా రూ.1.25 కోట్లతో చేపట్టనున్న పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, ఇరిగేషన్ శాఖలతో కలిసి విప్ గాంధీ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటిష్టమైన చెరువు కట్ట, నీరు పారేలా అలుగు, కబ్జాకు గురికాకుండా చుట్టూ ఫెన్సింగ్లతో పూర్తి స్థాయిలో వాటిని సంరక్షించుకోనున్నట్లు తెలిపారు. చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క తొలగింపు, పరిసరాల్లో పేరుకున్న వ్యర్థాల తొలగింపు సహా చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, పచ్చని చెట్ల పెంపకం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ సత్యనారాయణ, డీఈ నళిని, శేషగిరిరావు, ఏఈ పావని, పార్టీ నేతలు శ్రీనివాస్, పురుషోత్తం, అన్వర్ షరీఫ్, కిరణ్, గంగాధర్, మోహన్, మహేందర్, శ్రీనివాస్, గోపాల్, ఖాజా, వరలక్ష్మి, ఉమ, స్వరూప పాల్గొన్నారు.
మహబూబ్పేట్ చెరువు పరిశీలన..
మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్పేట్ చెరువును కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి విప్ గాంధీ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విలువైన చెరువు స్థలం కబ్జాకు గురికాకుండా పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. చెరువు స్థలం చుట్టూ ఫెన్సింగ్ను ఏర్పాటు చేయాలని, పరిసరాల్లో వాకింగ్ ట్రాక్, మొక్కలు నాటి ఆహ్లాదకరమైన పరిసరాలను నెలకొల్పాలని అధికారులకు గాంధీ సూచించారు. ఈఈ నారాయణ, డీఈ నళిని, శేషగిరిరావు, ఏఈ పావని తదితరులు పాల్గొన్నారు.