సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ)/ సుల్తాన్బజార్ : అందరూ సమన్వయంతో పనిచేస్తూ శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సీపీ సీవీ ఆనంద్ పిలుపునిచ్చారు. సోమవారం జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, శ్రీరామ నవమి ఉత్సవ సమితి సభ్యులు, ఆర్ అండ్ బీ, విద్యుత్, అగ్నిమాపక తదితర శాఖల అధికారులతో కలిసి సీతారాంబాగ్లోని ద్రౌపది గార్డెన్లో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ… పలు విభాగాలకు చెందిన అధికారులు శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి వేడుకలు, ర్యాలీల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చెట్ల కత్తిరింపు, బారి కేడింగ్, రోడ్ల మరమ్మతులు, మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు తదితర పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. 2022 ఉరేగింపులో ఏర్పడిన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని ఆ సమస్యలు రాకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. సీతారాంబాగ్ రామాలయం ద్రౌపది గార్డెన్ నుంచి కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు నిర్వహించబోయే శోభాయత్ర ఉరేగింపు మార్గాన్ని అధికారులు, నిర్వాహకులతో కలిసి సీపీ పరిశీలించారు.
శోభాయాత్ర కోసం వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తగిన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ర్యాలీలు, ప్రధాన ర్యాలీకి కలుస్తాయని పోలీసులు సూచించిన మార్గంలో వెళ్లాలని సూచనలు చేశారు. పోలీసులు, వలంటీర్లకు ప్రజలు సహకరించి, భక్తి శ్రద్ధలతో పండుగలు నిర్వహించుకోవాలని సీపీ సూచించారు. పాటలు, ప్రసంగాల్లో విద్వేషాలు, రెచ్చగొట్టే, ప్రేరేపించే అంశాలుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.