సిటీబ్యూరో, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): మేనేజ్మెంట్ విద్యతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యతనివ్వాలని, విద్యార్థి దశలోనే క్రీడల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఇండియన్ బాస్కెట్ బాల్ మాజీ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ సూచించారు. శుక్రవారం మోకిలలోని ఇక్ఫాయ్ క్యాంపస్లో ఐబీఎస్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆవేగ్ 14 పేరుతో నిర్వహించిన జాతీయ క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో ఎంబీఏ చేస్తున్న వారంతా ఒక్క చోట చేరి తమ కిష్టమైన క్రీడల్లో ఒకరితో ఒకరు పోటీపడడం విద్యార్థుల్లో పోరాటపటిమను పెంచుతుందన్నారు. కార్యక్రమంలో టీమ్ వ్యాప్స్ మాజీ అధ్యక్షుడు షఫిక్, పవన్ నందకుమార్,టీమ్ వ్యాప్స్ అధ్యక్షులు మహి త్యాగి, ఉపాధ్యక్షులు భాస్కర్ యాదవ్, నితిన్ శర్మ, సిద్ధార్థ్ గార్గ్, శ్రేయ్ చోరారియా, మానిశ్ సింగ్, సుస్మిత పండా, మోలీ జైన్, స్టూడెంట్ కో ఆర్డినేటర్ మాధవి గరికపర్తి తదితరులు పాల్గొన్నారు. ఇక్ఫాయ్ ఐబీఎస్ హైదరాబాద్కు చెందిన టీమ్ వ్యాప్స్ ఆధ్వర్యంలో ఆవేగ్ 14 పేరుతో నిర్వహిస్తున్న బిజినెస్ స్కూల్స్ ఇంటర్ స్పోర్ట్స్ టోర్నమెంట్కు మీడియా పార్ట్నర్స్గా నమేస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంస్థలు వ్యవహరిస్తున్నాయి.
మొదటి రోజు 8 అంశాల్లో క్రీడా పోటీలు..
టీమ్ వ్యాప్స్ ఆధ్వర్యంలో దేశంలోని వివిధ నగరాల్లోని బిజినెస్ స్కూళ్లలో చదువుతున్న ఎంబీఏ విద్యార్థులతో 15 క్రీడాంశాలతో పోటీలను నిర్వహించారు. బాస్కెట్బాల్, బాడ్మింటన్, క్రికెట్, స్వాష్, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, త్రోబాల్, వాలీబాల్, చెస్, బీజీఎంఐ, క్యారమ్ వంటి క్రీడల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటనున్నారు. మొదటి రోజు 8 క్రీడాంశాల్లో బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్,టేబుల్ టెన్నిస్,త్రోబాల్,వాలీబాల్, చెస్, ఫుట్బాల్లలో పోటీలు జరిగాయని నిర్వాహకులు తెలిపారు.
క్యాంపస్లో ప్రత్యేక ఏర్పాట్లు..
ఇక్ఫాయ్ హైదరాబాద్ క్యాంపస్లో వార్షిక క్రీడోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో నిర్వాహకులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. రకరకాల క్రీడా మైదానాలను ప్రత్యేకంగా తీర్చిదిద్ది క్రీడలు సాఫీగా జరిగేందుకు అనుగుణంగా మార్కింగ్, ఇతర మౌలికవసతులను మైదానాల్లో కల్పించారు. దేశంలోని వివిధ బిజినెస్ స్కూళ్ల నుంచి ఎంబీఏ విద్యార్థులు పాల్గొంటున్న నేపథ్యంలో క్రీడా కారులకు అవసరమైన ఏర్పాట్లను క్యాంపస్లో కల్పించారు. ఈ పోటీలు మూడు రోజుల పాటు జరుగుతామని టీమ్ వ్యాప్స్ ప్రతినిధి తెలిపారు.
రేపు ఫైనల్స్..
ఇక్ఫాయ్ ఐబీఎస్ హైదరాబాద్లో జరుగుతున్న క్రీడా పోటీల ఫైనల్స్ ఆదివారం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 12 అంశాల్లో జరిగే పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన బృందాలను విజేతలుగా ఎంపిక చేసి వారికి బహుమతులను ప్రదానం చేస్తామని తెలిపారు.