హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : వచ్చే విద్యా సంవత్సరం నుంచి జాతీయ స్థాయిలో డిజిటల్ యూనివర్సిటీలు అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్టు యూజీసీ అనుబంధ సంస్థ కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ (సీఈసీ) డైరెక్టర్ ప్రొఫెసర్ జేబీ నడ్డా తెలిపారు. జూలై నుంచి ఈ వర్సిటీలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ యూనివర్సిటీల గురించి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసినప్పటికీ.. దానికి పార్లమెంట్లో బిల్లు ఆమోదం లభించాల్సి ఉన్నదని, ఈ ప్రక్రియ వీలైనంత త్వరలోనే ముగియనున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా, ఉన్నత విద్యను దేశవ్యాప్తంగా ప్రస్తుతం 27 శాతం ఉన్న గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోను 2035 నాటికి 50 శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ యువతకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా సాంప్రదాయక వర్సిటీలకు అనేక ప్రత్యామ్నాయాలు వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే ఢిల్లీ వర్సిటీ వంటి వాటిలో మూక్స్, ఆన్లైన్ కోర్సులు ప్రవేశపెట్టారని వివరించారు. మరో ప్రత్యామ్నాయంగా డిజిటల్ యూనివర్సిటీలు రంగ ప్రవేశం చేయబోతున్నాయన్నారు. ఈ సందర్భంగా సీఈసీ డైరెక్టర్ ప్రొఫెసర్ జేబీ నడ్డా ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
దేశ వ్యాప్తంగా అందరికీ ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకెళ్లాలన్న లక్ష్యంలో భాగంగా.. ప్రభుత్వాలు అనేక చర్యలు కొనసాగిస్తున్నాయి. అందుకోసం సాధారణ, సాంప్రదాయక యూనివర్సిటీలతో దూర విద్యా విధానం కూడా అందుబాటులో ఉన్నది. అయితే సాంకేతిక పరిజ్ఞానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం, గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం చేరడంతోపాటు డిజిటల్ విప్లవంతో అందరికీ అందుబాటులో ఉన్నత విద్యను తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం డిజిటల్ యూనివర్సిటీలు సోషల్ సైన్స్ కోర్సులను మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని సక్రమంగా ఉన్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులకు ప్రాక్టికల్స్, ఫిజికల్ ల్యాబ్లు, ప్రాజెక్టు వర్క్లు వంటివి ఉంటాయి కాబట్టి అందుకోసం విద్యార్థులకు స్థానికంగా ఉండే యూనివర్సిటీల్లో డిజిటల్ యూనివర్సిటీ కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వీలైతే ఆయా కేంద్రాల్లో అవసరాన్ని బట్టి 20 నుంచి 30 కంప్యూటర్లు అందుబాటులో ఉంచే ఆలోచనలు కూడా జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన సిలబస్ కూడా దాదాపు రూపు దిద్దుకున్నది. వర్చువల్ విధానంలో తరగతులు నిర్వహిస్తారు.
డిజిటల్ యూనివర్సిటీలు ప్రభుత్వం తరఫున/ప్రైవేటు తరఫున కూడా ఏర్పాటు చేసుకోవడానికి యూజీసీ నుంచి అనుమతులు లభిస్తాయి. అయితే అందుకు సంబంధించి నియమనిబంధనలు పాటించాల్సి ఉన్నది. ఇప్పటికే కొన్ని యూనివర్సిటీలు ఆన్లైన్ కోర్సులు అందిస్తున్నాయి. ఈ క్రమంలో డిప్లొమా, యూజీ, పీజీ డిప్లొమా వంటి కోర్సులను తొలుత అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏడాది తర్వాత.. దశలవారీగా అన్ని డిగ్రీలు అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన యూజీసీ చేస్తున్నది.