మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో ఇన్స్పెక్టర్ హరిభూషణ్కు 3వ బహుమతి
సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): జాతీయ స్థాయిలో సైబర్ క్రైమ్ కేసుల దర్యాప్తులో హైదరాబాద్ పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ ఘటనపై కేసు దర్యాప్తు అధికారి జాతీయ స్థాయిలో 3వ బహుమతిని అందుకున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఎన్సీఆర్బీ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును హైదరాబాద్ సైబర్క్రైమ్ ఇన్స్పెక్టర్ హరిభూషణ్ రావు అందుకున్నారు. రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సైబర్క్రైమ్ కేసుల దర్యాప్తులో సక్సెస్ సాధించిన కేసుల కేస్ స్టడీపై జాతీయ స్థాయిలో పోటీ నిర్వహించారు. బ్యాంకింగ్ సిస్టమ్లో సైబర్ దాడులకు సంబంధించిన కేసుల దర్యాప్తునకు సంబంధించిన విభాగంలో హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ఈ అవార్డును దక్కించుకున్నారు.
ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ సర్వర్ను హ్యాక్ చేసిన సైబర్నేరగాళ్లు రూ.12.48 కోట్లు కొట్టేశారు. వేగంగా స్పందించిన సైబర్క్రైమ్ పోలీసులు.. హ్యాకర్స్ను అడ్డుకుంటూ రూ. 2,08,55,536 ఏటీఎంల నుంచి విత్ డ్రా కాకుండా ఆపారు. అదేవిధంగా.. రూ. 1,08,48,990 ఇతర ఖాతాలకు బదిలీ కాకుండా అడ్డుకొని, తిరిగి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించారు. ఈ కేసులో దేశ వ్యాప్తంగా 27 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేయగా.. అందులో నలుగురు నైజీరియన్లు ఉన్నారు. 16 మందికి 41(ఏ) సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. ఒకపక్క హ్యాకర్స్ను అడ్డుకుంటూ మరోపక్క హ్యాకర్లను పట్టుకోవడంలో హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు స్పందించిన తీరుపై ప్రశంసలు అందాయి. ఇలాంటివి 19 కేసులు పోటీ పడ్డాయి. హైదరాబాద్ సైబర్క్రైమ్ ఇన్స్పెక్టర్ కేసు దర్యాప్తుపై ఇచ్చిన ప్రజెంటేషన్ను మెచ్చిన నిర్వాహకులు.. 3వ బహుమతిని ప్రకటించారు. ఈ మేరకు హరిభూషణ రావు ఈ అవార్డును అందుకోవడంపై సైబర్క్రైమ్ ఉన్నతాధికారులు ఇన్స్పెక్టర్తో పాటు ఆయన బృందానికి అభినందనలు తెలిపారు.