గోల్నాక, అక్టోబర్ 27: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో నిందితుడైన నందకుమార్ ఎవరో తనకు తెలియదని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. వీరిద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఉన్నదని, అంబర్పేటలో ఎవరిని అడిగినా చెబుతారని ఆయన తెలిపారు. గురువారం అంబర్పేట అలీకేఫ్ చౌరస్తాలో టీఆర్ఎస్ నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేశారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్రెడ్డితో నిందితుడు నందకుమార్ కలిసి ఉన్న ఫొటోను ఎమ్మెల్యే వెంకటేశ్ ప్రదర్శించారు. వారిద్దరి మధ్య ఉన్న సంబంధాలను వివరించారు.
పదేండ్ల కిందట అంబర్పేట శివం రోడ్డులో సీజన్స్ హోటల్ను ప్రారంభించిన నందకుమార్.. మంత్రి జి.కిషన్రెడ్డి అండదండలతో రూ.కోట్లాది రూపాయలు సంపాదించాడని ఆరోపించారు. కిషన్రెడ్డి సహకారం వల్లే తానింత స్థాయికి వచ్చానంటూ నిందితుడు నందకుమార్ స్వయంగా చెప్పారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. సీజన్స్ హోటల్లో కిషన్రెడ్డి ఎన్నో కార్యాలు, కార్యక్రమాలు నిర్వహించిన విషయం వాస్తవం కాదా.. అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో అడ్డంగా దొరికిపోయిన నందకుమార్ను తాను అసలే గుర్తు పట్టను.. అని అనడంతో పాటు రోజుకు ఎంతో మంది కలుస్తుంటారని కిషన్రెడ్డి బుకాయించడం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు. బీజేపీ, కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా టీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ సమాజాన్ని ఏమీ చేయలేరని అన్నారు. బీజేపీ కుట్రలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించి.. బీజేపీ కుట్రలను తిప్పికొడతారని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.