బంజారాహిల్స్, నవంబర్ 7 : క్యాన్సర్ను మొదటి దశలో గుర్తిస్తే వంద శాతం నయం చేయవచ్చని, చాలా మంది రోగులు క్యాన్సర్ ముదిరిన తర్వాతనే వైద్యులను సంప్రదించడంతోనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని బసవతారకం ఇండో ఆమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. మంగళవారం జాతీయ క్యాన్సర్ అవగాహన దినం సందర్భంగా బంజారాహిల్స్లోని బసవతారకం ఇండో ఆమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
క్యాన్సర్కు కారణాలు, లక్షణాలు, చికిత్సా పద్ధతులు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం అమెరికాకు చెందిన రవి పొట్లూరి ఆస్పత్రిలోని రోగుల కోసం పంపించిన 30 వీల్చైర్లను నందమూరి బాలకృష్ణ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సీఈవో డా.ఆర్వీ.ప్రభాకర్రావు, డా.కల్పనా రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.