నాయకులతో కలిసి పనులు పరిశీలిస్తున్న విప్ గాంధీ
మాదాపూర్, మార్చి 16: రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నాలా విస్తరణ పనులను చేపడుతు ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్యలను శాశ్వత పరిష్కారం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని ఈర్ల చెరువు నుంచి దీప్తిశ్రీ నగర్ నాలా వరకు రూ. 15.88 కోట్ల నిధులతో 2.4 కిలో మీటర్ల మేర చేపడుతున్న నాలా విస్తరణ పనుల్లో భాగంగా రామకృష్ణ నగర్ కాలనీలో జరుగుతున్న నాలా విస్తరణ పనులను బుధవారం కార్పొరేటర్ వి.పూజిత గౌడ్తో పాటు మాదాపూర్ కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముంపునకు శాశ్వత పరిష్కారం దిశగా నాలా విస్తరణ పనులను చేపట్టడంతో ప్రజలకు ముంపు సమస్య తీరనున్నట్లు చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పనుల్లో పురోగతి సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్ గౌడ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
లింక్రోడ్డు పరిశీలన..
మియాపూర్, మార్చి 16 : హైదర్నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట రోడ్డు మోర్ సూపర్ మార్కెట్ నుంచి సమతానగర్ కాలనీకి నిర్మించనున్న లింక్ రోడ్డు ప్రాంతాన్ని కార్పొరేటర్ శ్రీనివాస్రావు, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి విప్ గాంధీ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా ఈ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తానన్నారు. ట్రాఫిక్ సమస్య నివారణకు ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణాన్ని ముమ్మరంగా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ గోవర్ధన్, ఏఈ రాజీవ్, మహదేవ్, పార్టీ నేతలు శ్రీనివాస్, గౌతంగౌడ్ పాల్గొన్నారు.