విప్,ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
దీప్తిశ్రీ నగర్ కాలనీలో నాలా నిర్మాణ పనులు పరిశీలన
మాదాపూర్, మే 26: రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నాలాల విస్తరణ పనులను వేగవంతం చేయాలని విప్,ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ సూచించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ కాలనీలో చేపట్టిన నాలా విస్తరణ పనుల్లో భాగంగా సత్యనారాయణ ఎన్క్లేవ్ వద్ద రూ. 1.55 కోట్ల వ్యయంతో చేపడుతున్న నాలా విస్తరణ పనులను మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని చేపట్టిన నాలాల విస్తరణ పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
కరోనా విపత్కర పరిస్థితుల్లో అభివృద్ధి, సంక్షేమం ఆగకూడదని లక్ష్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా పనుల్లో వేగం పెంచాలని కోరారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని లోతట్టు, నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఏఈ శివప్రసాద్, వర్క్ ఇన్స్పెక్టర్ జగన్, చందానగర్ టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, నరేంద్ర పాల్గొన్నారు.