మేడ్చల్ కలెక్టరేట్, జనవరి 17 : నాగారం మున్సిపాలిటీలోని నాలుగు వైకుంఠధామాలను రూ.3 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. నూతన హంగులతో ఆఖరి మజిలీకి అన్ని సౌకర్యాలు కల్పిస్తుండటంతో మున్సిపాలిటీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడిపాలనలో వైకుంఠధామాలను పట్టించుకోలేదు. కేసీఆర్ హయాంలో నేడు వైకుంఠధామాల్లో ఆధునిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీ పరిధిలో వైకుంఠధామాలను నిర్మిస్తున్నది. గతంలో ఎవరైన చనిపోతే దహన సంస్కారాలు చేసిన చోట నీటి సదుపాయం, స్నానపు గదులు, మరుగు దొడ్లు లేక అంత్యక్రియలకు వచ్చిన వారు ఇబ్బందులు పడేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆఖరి మజిలీ గౌరవప్రదంగా సాగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ వైకుంఠధామాలను ఆధునిక హంగులతో నిర్మించడానికి శ్రీకారం చుట్టారు.
మున్సిపల్ పరిధిలో..
నాగారం మున్సిపాలిటీ పరిధిలో రూ.కోటితో సామూహిక వైకుంఠధామం పనులు 80 శాతం పూర్తి చేశారు. రాంపల్లిలో రూ.కోటితో సామూహిక వైకుంఠధామం పనులు 40 శాతం, ఎస్సీ వైకుంఠధామం రూ. 50 లక్షలతో 20 శాతం, ఎస్సీ మాల రూ. 50 లక్షలతో నిర్మిస్తున్న వైకుంఠధామం 30 శాతం పనులు పూర్తయ్యాయి. మిగితా పనులు వేగంగా చేస్తున్నారు. త్వరలో ఆధునిక హంగులతో నిర్మించిన వైకుంఠధామాలను ప్రారంభించనున్నారు.
ఉమ్మడి పాలనలో ఇబ్బందులు
ఉమ్మడి పాలనలో వైకుంఠధామాలను ఎవరూ పట్టించుకోలేదు. నిధులు సైతం మంజూరు చేయకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ వైకుంఠధామాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు.మున్సిపాలిటీలో వైకుంఠధామాలను ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నాం.
త్వరలో పనులు పూర్తి ..
మున్సిపాలిటీలో సామూహిక వైకుంఠధామాల అభివృద్ధి పనులు త్వరలో పూర్తి చేస్తాం. ప్రహరీ నిర్మాణం, పురుషులు, స్త్రీలకు విడివిడిగా మరుగుదొడ్లు, స్నానపు గదులు, దహనవాటికలు, లైటింగ్, బోర్ మోటర్ ఏర్పాటుతో పాటు మొక్కలు నాటడం, గార్డెనింగ్ తదితర పనులు చేపడుతున్నాం.