కడ్తాల్, మే 28: దైవ దర్శనానికి వచ్చిన యువకుడు కోనేరులో గల్లంతైన సంఘటన ఆదివారం మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో చోటుచేసుకున్నది. ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్ శాలిబండ హరిబౌలిలోని ఒకే కుటుంబానికి చెందిన 15 మంది సభ్యులు ఆదివారం కడ్తాల్ మండలంలోని మైసిగండి మైసమ్మతల్లి దర్శనానికి వచ్చారు. అమ్మవారి దర్శనం తర్వాత భోజనాల అనంతరం, మైసమ్మ ఆలయం సమీపంలోని శివాలయం ముందు ఉన్న కోనేరు వద్దకు వెళ్లారు. ఈత కొట్టడానికి వెళ్లిన సంజయ్ (38) కోనేరు మధ్యలోకి వెళ్లగానే అదృశ్యమయ్యాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే ఆలయ నిర్వాహకులకు సమాచారమిచ్చారు. ఆలయ నిర్వాహకులు అందించిన సమాచారం మేరకు కడ్తాల్ పోలీసులు, మహేశ్వరం అగ్నిమాపక సిబ్బంది కోనేరు వద్దకు చేరుకున్నారు. స్థానిక గజ ఈతగాళ్లు ఇనుమ చువ్వల సాయంతో కోనేరులో గాలింపు చర్యలు చేపట్టారు. సంజయ్ జాడ కనబడలేదు. ఈ ఘటనతో సంజయ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సోమవారం ఎన్డీఆర్ఎఫ్ బృందంతో గాలింపు చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.
కంచె లేకపోవడంతో…
మైసిగండి శివాలయం, రామాలయాల ఎదుట ఉన్న కోనేరు ప్రమాదభరితంగా మారిందని, యేటా ఇలాంటి సంఘటనలు జరిగి ఆలయానికి వచ్చే భక్తులు ప్రాణాలు కోల్పోతుండటంతో స్థానికులు ఆలయ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనేరులో స్నానానికి వెళ్లకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని, గతంలోనే అధికారులను, నిర్వాహకులను కోరగా వారు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కోనేరులో కంచెను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు.