వెంగళరావునగర్ : పవిత్రమైన దేవాలయంలో సేవాబావంతో పనిచేయాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. డివిజన్ పరిధిలోని జీటీఎస్ కాలనీ శ్రీ వీరాంజనేయ అయ్యప్ప భవాని శంకర సాయిబాబా దేవాలయ పాలక మండళ్ల ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్యఅతిధిగా హాజరై దేవాదాయ ధర్మాధాయ శాఖ ద్వారా నియమితులైన చైర్మన్, పాలక మండళ్ల సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఆలయ కార్యనిర్వహణాధికారి మొహన్ తో కలిసి ప్రమాణ స్వీకారోత్సవ వేడుకను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ..దేవాలయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. దేవాలయాల్లో దైవసేవలో తరించే పూజారుల సంక్షేమంతో పాటు అర్చకుల పిల్లలకు మంచి విద్యను అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉన్నారని పేర్కొన్నారు.
పవిత్రమైన ఆలయంలో సేవ చేసే అదృష్టం లభించిన ట్రస్టు కమిటీ, చైర్మన్లు బాగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆయన ఆకాంక్షించారు. జీటీఎస్ దేవాలయానికి ఎంతో పేరుందని..ఈ దేవాలయానికి పరిసర ప్రాంతవాసులు బాగా వస్తారని..భక్తులకు ఏ లోటూ లేకుండా చూసుకోవాలని అన్నారు.
స్వార్థబుధ్దితో దేవాలయాల్లో పనిచేయకూదడని..అలాంటి వారిని దేవుడు శిక్షిస్తాడని ఆయన అన్నారు. అనంతరం నూతనంగా ఎంపికైన కమిటీ చేత ఆలయ ఈ.ఓ మోహన్బాబు ప్రమాణం చేయించారు. కాగా నూతన కమిటీ చైర్మన్గా సి.హెచ్.చిన్న రమేష్, కమిటీ సభ్యులుగా సి.హెచ్.శ్రీనివాస్, కిలారు నరసింహారావు, టి.కృష్ణమూర్తి, జి.లక్ష్మి, త్రిపురనేని అమ్మాజీ, కురా వెంకటేశ్వర్లుతో పాటుగా దేవాలయం ఎక్స్ అఫిషియో సభ్యులుగా దేవేంద్ర శర్మలను నియమించారు.
నిరంతరం భక్తులకు అందుబాటులో ఉంటూ వారికి ఎటువంటి సమస్యలు కలుగకుండా చర్యలు తీసుకుంటూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని నూతనంగా ఎంపికైన ఆలయ చైర్మన్ చిన్న రమేష్ అన్నారు.ఈ కార్యక్రమంలో వెంగళరావునగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్య విజయ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, శ్యాంరావు ముదిరాజ్, వేణు, వేణుగోపాల్ యాదవ్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.