కవాడిగూడ, ఫిబ్రవరి 6: బడ్జెట్లో మైనార్టీలకు అధిక నిధులు కేటాయించిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ భోలక్పూర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వై.శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి భోలక్పూర్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బడ్జెట్లో మైనారిటీలకు 2,200 కోట్లు కేటాయించి వారి అభివృద్ధికి కృషిచేయడం హర్షణీయమని అన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ కేటాయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు జునేద్ బాగ్దాది, మహ్మద్ అలీ, జబ్బార్, వాహబ్, మక్బూల్, చాంద్పాషా, కేఎం సాయి, తదితరులు పాల్గొన్నారు.
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కు రూ.2018కోట్లు
సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ఆరోగ్యమే మహాభాగ్యం అనే రీతిలో తెలంగాణ సర్కార్ ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా వైద్య, ఆరోగ్యశాఖకు పెద్దపీఠ వేసింది. ఇప్పటికే కోట్ల రూపాయలతో ప్రజా వైద్యాన్ని బలోపేతం చేసిన ప్రభుత్వం ఈసారి గ్రేటర్లోని దవాఖానల అభివృద్ధికి రూ.2,080.43కోట్లు కేటాయించింది. ఇందులో నగరం నలువైపులా నిర్మిస్తున్న నాలుగు సూపర్స్పెషాలిటీ హాస్పిటల్స్కు రూ.2018కోట్లు కేటాయించగా ఇతర దవాఖానల అభివృద్ధికి మరో రూ.62.43కోట్లు కేటాయించింది. వీటిలో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ అభివృద్ధికి రూ.37.76కోట్లు, నిమ్స్ అభివృద్ధికి రూ.15.67కోట్లు, అత్యవసర వైద్యపరికరాల కొనుగోలుకు కోటి రూపాయలు కేటాయించగా ఆయా దవాఖానలకు నూతన భవనాలు నిర్మించేందుకు రూ.8కోట్లు కేటాయించింది. ప్రజావైద్యానికి వరుసగా ప్రాధాన్యత ఇస్తుండటంపై వైద్యరంగ నిపుణులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మైనార్టీల సంక్షేమానికి రూ.2200 కోట్లు..
అబిడ్స్, ఫిబ్రవరి 6 : దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని రాష్ట్ర వక్ఫ్బోర్డు మాజీ డైరెక్టర్ వహీద్ అహ్మద్ పేర్కొన్నారు. బడ్జెట్లో మైనార్టీల సంక్షేమానికి రూ.2200 కోట్లు కేటాయించడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ షకీల్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అద్దంపట్టేలా..!
అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కడుతూ.. ప్రజలందరి ఆశలు, ఆకాంక్షలకు అద్దంపట్టేలా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టారు. సమతూకంగా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా నిధుల కేటాయింపు జరిగింది. ముఖ్యంగా గతంలో కంటే హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి జరిగేలా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. బడ్జెట్లో అగ్రభాగం ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం, సమృద్ధిగా తాగునీరు, ప్రజా సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చారు. మూసీ అభివృద్ధికి రూ.200కోట్లు, శాంతి భద్రతల పరిరక్షణకు రూ.250 కోట్లు కేటాయించడం సంతోషంగా ఉంది. ఈ బడ్జెన్ను రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారు.
– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
అన్నివర్గాలు మెచ్చిన బడ్జెట్
అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఉన్నది. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బడుగు, బలహీన వర్గాలు, అగ్రవర్ణ పేదలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, బీసీ వర్గాల సంక్షేమానికి, పరిశ్రమల అభివృద్ధికి బడ్జెట్లో నిధుల కేటాయింపుపై రాష్ట్ర ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్లో బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి రూ.95.25 కోట్లు కేటాయించడం సంతోషంగా ఉంది.
-చామకూర మల్లారెడ్డి, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి