చర్లపల్లి, మే 16 : క్షుద్రపూజలతో బంగారాన్ని వెలికితీయడానికి సహాయం కోరిన ఓ బిల్డింగ్ కాంట్రాక్టర్ను బ్లాక్మెయిల్ చేసి హత్యచేశారు.. ఈ కేసులో ఆరుగురు నిందితులను ఆదివారం కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సీఐ మన్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ ప్రకాశం జిల్లా, ఒంగోలుకు చెందిన ఆముదాలపల్లి రామ్మూర్తి(61) కేపీహెచ్బీకాలనీలో ఉంటూ బిల్డింగ్ కాంట్రాక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా.. అతనికి ఒంగోలులో ఆరు ఎకరాల పొలం ఉంది. ఇందులో బంగారం ఉందని నమ్మిన రామ్మూర్తి.. క్షుద్రపూజలు నిర్వహించి.. బంగారాన్ని వెలికితీయడానికి ఆల్విన్కాలనీకి చెందిన శ్రీనివాస్రెడ్డిని సహాయం కోరాడు.. ఇతను కుషాయిగూడ, నాగార్జుననగర్ కాలనీకి చెందిన అంథోని మోసెస్ లారెన్స్ అలియాస్ శ్రీకాంత్ను ఆశ్రయించి.. క్షుద్రపూజలు చేసి.. బంగారాన్ని బయటకు తీయాలని కోరి.. అడ్వాన్స్గా రూ.20 వేలు ఇచ్చారు.
ఈ నెల 10న రామ్మూర్తి.. నాగార్జుననగర్ కాలనీకి వెళ్లి పూజల విషయమై శ్రీకాంత్తో మాట్లాడాడు. పూజలు నిర్వహించగా రూ.30 లక్షలు ఖర్చు అయ్యిందని.. తన కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురయ్యారని.. వెంటనే రూ.30 లక్షలు చెల్లించాలని శ్రీకాంత్ కోరాడు.. ముందుగా రూ.7లక్షలు చెల్లించాలని స్నేహితులు పార్సిగుట్టకు చెందిన శాగంటి వాణిసాగర్, కుషాయిగూడ సిద్ధార్థ్నగర్కు చెందిన జిట్టుసింగ్, మనోజ్సింగ్, శ్రీనివాస్రెడ్డితో పాటు శ్రీకాంత్, ఇతడి భార్య అంథోని భాగ్యలు కలిసి పథకం ప్రకారం రామ్మూర్తిని బ్లాక్మెయిల్ చేసి తీవ్రంగా కొట్టారు. భయాందోళన చెందిన రామ్మూర్తి .. తన కుటుంబ సభ్యులకు ఫోన్చేసి రూ. 7 లక్షలు ఏర్పా టు చేయాలని కోరాడు. డబ్బులు ఇచ్చేలోపే రామ్ముర్తి ఫోన్ స్విచాఫ్ అయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీకాంత్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. తాము కొట్టడంతోనే మృతి చెందగా మృతదేహాన్ని చెరువులో పడేశామని ఒప్పుకున్నాడు. దీంతో శ్రీకాంత్తోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.