ఇద్దరి మనసులు కలిశాయి. ఏడడుగులు నడువాలని నిర్ణయించుకున్నారు. పెద్దలు సైతం ఒప్పుకోవడంతో ప్రియురాలి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అంతలోనే ప్రియుడి మనస్సు మారింది. కారణం ఇద్దరి కులాలు వేరుకావడమే. ఎలాగైనా ప్రియురాలిని వదిలించుకోవాలని పథకం వేశాడు. లాడ్జికి తీసుకువెళ్లి హతమార్చాడు. ఇక్కడ అదృశ్యమై గుంటూరులో కత్తిపోట్లతో దర్శనమిచ్చాడు. రెండు రోజుల కిందట జరిగిన సినీ పక్కీని తలపించే సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
సిటీబ్యూరో, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ)/మాదాపూర్ :ప్రియురాలిని ముందస్తు పథకం ప్రకారమే హత్య చేశాడు. సాక్ష్యాలను చెరిపేసేందుకు ప్రయత్నించాడు. చివరకు హైదరాబాద్ నుంచి అదృశ్యమై ఏపీలో ఓ దవాఖానలో కత్తి పోట్లతో ప్రత్యక్షమయ్యాడు. ప్రియురాలిని పెండ్లి చేసుకోవడం ఇష్టంలేకనే ప్రియుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సైబరాబాద్ పోలీసులు అనుమానిస్తుండగా.. ప్రియుడు మాత్రం పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతోనే ఆత్మహత్యకు ప్రయత్నించగా ఈ విషాదం చోటు చేసుకుందని వివరించాడు.
చందానగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ రాష్ట్రం గుంటూరు జిల్లా రెంటచింతలకు చెందిన గాదె కోటిరెడ్డి(25) వలస వచ్చి చందానగర్ నల్లగండ్లలోని ఓ ప్రైవేటు దవాఖానలో మెడికల్ రిప్రజెంటెటివ్గా పనిచేస్తున్నాడు. ఒంగోలుకు చెందిన గొర్రెముంచు నాగచైతన్య(24) నల్లగండ్లలోని ఓ ప్రైవేటు దవాఖానలో నర్సుగా పనిచేస్తున్నది. ఈ క్రమంలో కోటిరెడ్డి, నాగచైతన్యల మధ్య స్నేహం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. గత ఆరు నెలల నుంచి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుని విషయాన్ని పెద్దలకు చెప్పారు. నాగచైతన్య తన మేనమామకు చెప్పి కోటిరెడ్డితో ప్రేమ వివాహం చేసుకునేందుకు తల్లిదండ్రులను ఒప్పించింది.
ఇదిలా ఉండగా కోటిరెడ్డి ఈ నెల 23న నాగచైతన్యను నల్లగండ్లలోని ఓ లాడ్జికి తీసుకువెళ్లాడు. 24న మధ్యాహ్నం నుంచి లాడ్జిలోని వీరి గది నంబరు 101 నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం, అందులో నుంచి ఎవరూ బయటికి రాకపోవడంతో అర్ధరాత్రి లాడ్జి సిబ్బంది మేనేజర్కు సమాచారం ఇచ్చి మారు తాళంతో తలుపులు తెరిచారు. అప్పటికే నాగచైతన్య గొంతుతెగి రక్తపు మడుగులో పడి ఉంది. సమాచారం అందుకున్న చందానగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.
నల్లగండ్లలోని లాడ్జి నుంచి అదృశ్యమైన కోటిరెడ్డి కడుపు, గొంతుపై కత్తిపోట్లతో గుంటూరులోని ఓ దవాఖానలో ఉన్నట్లు సోమవారం చందానగర్ పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కోటిరెడ్డిని నగరానికి తీసుకువస్తున్నారు.
కోటిరెడ్డి పథకం ప్రకారమే నాగచైతన్యను హత్య చేశాడని పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు. అంతేకాకుండా సీసీ కెమెరాల ద్వారా కోటిరెడ్డి నల్లగండ్లలోని ఓ సూపర్మార్కెట్లో కత్తిని కొనుగోలు చేసిన దృశ్యాలను సేకరించారు. వారి ప్రేమ వ్యవహారాలతో పాటు ఇతర అంశాలు పోలీసులకు దొరకకుండా ఉండడానికి నాగచైతన్య ఫోన్ను తన వెంటనే తీసుకుపోయాడని, అందులో కీలక అంశాలను డిలీట్ చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే పెళ్లి చేసుకుంటానని చెప్పిన కోటిరెడ్డి ఆ తర్వాత ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లి వాయిదా వేస్తున్నట్లు సమాచారం. నాగచైతన్య పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని హత్య చేసినట్లు లభించిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా నాగచైతన్య మరణించిందని ఆ దృశ్యం చూసి భయపడి తాను పారిపోయి ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు కోటిరెడ్డి బుకాయిస్తున్నట్లు తెలిసింది. నాగచైతన్య మర్డర్ మిస్టరీ బుధవారం వీడనున్నదని పోలీసులు పేర్కొన్నారు.