చాంద్రాయణగుట్ట,అక్టోబర్ 16 : ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నలుగురిని రిమాండ్కు తరలించారు. కేసులో నిందితులు సొంత అన్నదమ్ములు కా వడం విశేషం. హత్యకు సంబంధించిన వివరాలను ఫలక్నుమా ఏసీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ వెల్లడించారు. బార్కాస్ సలాల ప్రాంతానికి చెందిన అమీద్ బిన్ఆల్ జుబేది (37), ఇదే ప్రాంతానికి చెందిన రయీస్జాబ్రీ, అధిల్ జాబ్రీ, సయ్యద్ సలేహా జాబ్రీ, సాద్ బిన్ సలేహా జాబ్రీ సొంత అన్నదమ్ములు పదేండ్లుగా దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నారు. వీరిలో అమీద్ బిన్ ఆల్ జుబేదికి దూబాయ్లో సొంత ఇల్లు ఉన్నది. 2019 జనవరి 5న దుబాయ్ నుంచి హైదరాబాద్కు వస్తుండగా అమీద్ బిన్ ఆల్ జుబేది రయీస్కు ఓ బ్యాగ్ను ఇచ్చాడు. రయీస్ శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానం దిగాడు.
కస్టమ్స్ పోలీసులు చేసే తనిఖీల్లో కిలో బంగారం దొరికింది. అది దొంగ బంగారంగా గుర్తించి రయీస్ పాస్పోర్టును జప్తు చేశారు. కోర్టులో కేసు నడుస్తున్నది. దాంతో అతడు నష్ట పరిహారం ఇవ్వాలని జుబేదిపై ఒత్తిడి తెచ్చాడు. రయీస్ సోదరులు ముగ్గురు డబ్బులు చెల్లించడంతో పాటు పాస్పోర్టును విడిపించాలని కోరారు. అమీద్ బిన్ ఆల్ జుబేది వారిని రేపుమాపు అంటూ తిప్పడమే కాకుండా ఈ నెల 13 న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ రోజు సాయంత్రం అషామాబాద్ రోడ్డుపై కారులో ప్రయాణిస్తుండగా అన్నదమ్ములు ద్విచక్ర వాహనాలపై వెంబడించి కారును ఆపారు.
అమీద్ బయటకు రాగానే కత్తులతో పొడిచారు. నేలపై పడిన అమీద్ నెత్తిపై బండరాయి వేసి పారిపోయారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన అమీద్ను కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఘటన వివరాలు సేకరించిన పోలీసులు నిందితులను పట్టుకొని రిమాండ్కు తరలించారు. వారి వద్ద నాలుగు సెల్ఫోన్లు, రెండు కత్తులు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.