బాలానగర్, జూన్ 28 : కుటుంబంలో ఎవరో ఒకరు తరుచూ అనారోగ్యానికి గురవుతుండటంతో చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో పినతండ్రి కొడుకు (అన్న)ను రోకలి బండతో మోది హత్య చేశాడు.. ఈ ఘటన జనవరిలో జరగగా.. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని సోమవారం కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు .. ఏసీపీ సురేందర్రావు, సీఐ నర్సింగ్రావు, డీఐ శ్రీనివాస్లతో కలిసి వివరాలు వెల్లడించారు. నాగర్కర్నూల్ జిల్లా పెంట్లపల్లి గ్రామానికి చెందిన నక్క చందు (30) బతుకు దెరువు కోసం నగరానికి వలస వచ్చి కూకట్పల్లి ప్రకాశ్నగర్లో నివాసముంటూ పూల వ్యాపారం చేస్తున్నాడు. కాగా.. చందు కుటుంబంలో తరచూ ఎవరో ఒకరు అనారోగ్యానికి గురవుతున్నారు.
అనారోగ్యానికి గల కారణాలపై చందు కుటుంబ సభ్యులు అదే ఊరిలో ఓ వ్యక్తిని ఆశ్రయించగా.. అతను పరిశీలించి చేతబడి చేయడం ద్వారా అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపాడు. దీంతో పినతండ్రి కుమారుడు వరుసకు అన్న అయిన నక్క కృష్ణపై అనుమానం పెంచుకున్నాడు. ఎలాగైనా కృష్ణను అడ్డుతొలిగించుకోవాలని పథకం పన్నాడు. తన పథకంలో భాగంగా జనవరి 3న అర్ధరాత్రి ఇంట్లో పడుకున్న కృష్ణతలపై రోకలి బండతో మోది హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో వేసుకొని బైక్ (టీఎస్ 07 ఈఎన్ 2485)పై తీసుకుని.. కూకట్పల్లి రామయ్యనగర్ నల్ల చెరువులో పడేశాడు.
మరుసటి రోజు మృతదేహం తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేసినా నిందితుడి ఆచూకీ తెలియలేదు.. సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించగా బైక్ నంబర్ ఆధారంగా నిందితుడు చందుగా గుర్తించారు. సోమవారం అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన డీఎస్సై మాణిక్యం, సిబ్బంది ఎల్లస్వామి, కబీర్, పరమేశ్వర్రెడ్డి, వెంకటేశ్, సురేశ్లను డీసీపీ అభినందించి.. రివార్డును అందజేశారు