చార్మినార్, మే 21: హత్యాయత్నం కేసులో రాజీకి రావాలని బెదిరింపులకు పాల్పడుతున్న రౌడీషీటర్ను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. బహదూర్పుర ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. చిరాగ్అలీలేన్లో నివసించే ఎజాజ్ (24) రౌడీషీటర్. ఇతడిపై పలు కేసులు ఉన్నాయి. ఇదే ప్రాంతంలో నివసించే అఫ్జల్ రఫీక్ (65) కుమారుడిపై గతేడాది ఎజాజ్ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో కేసు వెనక్కి తీసుకోవాలని, రాజీకి రావాలని ఎజాజ్ ప్రత్యర్థులపై ఒత్తిడి చేస్తున్నాడు. కుదరదని తేల్చి చెప్పిన అఫ్జల్ రఫీక్ కుమారుడు.. తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్లి.. ఇతర ప్రాంతంలో నివసిస్తున్నాడు. దీంతో ఎజాజ్ నిత్యం అఫ్జల్ రఫీక్ ఇంటికి వెళ్లి రాజీకి రాకపోతే బస్తీలో ఎలా ఉంటారో చూస్తానని బెదిరించేవాడు. గురువారం రాత్రి సైతం అఫ్జల్ రఫీక్ ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డాడు. విసిగిపోయిన అఫ్జల్ రఫీక్ నలుగురు వ్యక్తులతో కలిసి ఎజాజ్పై కత్తులతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఎజాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఉస్మానియా వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు.