కుత్బుల్లాపూర్, నవంబర్ 19: వివాహేతర సంబంధం పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టింది. భర్త స్నేహితుడితో ఆమె గుట్టుచప్పుడు కాకుండా వివాహేతర సంబంధం సాగించింది. విషయం తెలుసుకున్న భర్త ఆమెను దూరం పెట్టాడు. ప్రియుడి వద్దకు వెళ్లితే.. కాదు పొమ్మన్నాడు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ మహిళ సైకోగా మారింది. భర్త నుంచి తనను దూరం చేయడానికి కారణమైన ప్రియుడిని హత మార్చేందుకు ప్రణాళిక రూపొందించింది. ప్రియుడి కండ్లల్లో కారం కొట్టింది. ఆపై తలపై సుత్తెతో దాడి చేసి హత్య చేసింది. చివరకు కటకటాల పాలైంది.
పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగిన ఈ దారుణ హత్య ఉదంతం బయటపడింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సుభాష్నగర్ డివిజన్ భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన కైలాష్ చౌదరి (38), ఉరారం స్నేహితులు. వీరిద్దరు కలిసి సుభాష్నగర్లో కొన్నేండ్ల కిందట శ్రీ దుర్గామార్కెటింగ్ (ఎలక్ట్రానిక్) వ్యాపారం పెట్టారు. ఉరారం భార్య సీతాదేవి, కైలాష్ చౌదరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ విషయం ఉరానానికి తెలియడంతో.. భార్యను దూరం పెట్టాడు. కైలాష్ చౌదరి కూడా తన తప్పును కప్పిపుచ్చుకునే క్రమంలో ఆమెపై భర్తకు లేనిపోని మాటలు చెప్పి వారిద్దరి మధ్య మరింత దూరం పెంచాడు. కైలాష్ చౌదరి కూడా ఆమెను దూరం పెట్టాడు. భర్త, ప్రియుడి ప్రవర్తనతో మనస్తాపానికి గురైన ఆమె సైకోగా మారింది. శనివారం సాయంత్రం శ్రీదుర్గా మార్కెటింగ్లోని నాల్గో అంతస్తులో ఉన్న కైలాష్ చౌదరి వద్దకు వెళ్లింది. తన వెంట తీసుకెళ్లిన కారంపొడి అతడి కళ్లల్లో చల్లింది. ఆపై సుత్తెతో తలపై దాడి చేసి హత్య చేసింది. ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయింది. కైలాష్ చౌదరీ భార్య సుశీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.