సుల్తాన్బజార్, ఏప్రిల్ 17: అడ్డాకూలీల మధ్య తలెత్తిన చిన్న వివాదం హత్యకు దారి తీసింది. సహచర కార్మికుడిని ఇటుకతో తలపై బాది హత్య చేశాడు. ఈ ఘటన శనివారం తెల్లవారు జామున అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్లో జరిగింది. ఇన్స్పెక్టర్ రవీందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ పేట జిల్లా, మగ్ధూర్ మండలం, మోమిన్పూర్ గ్రామానికి చెందిన ఆశప్ప (55) కొన్నేండ్ల క్రితం బతుకు దెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. గౌలిగూడ లేబర్అడ్డాలో కార్మికుడిగా పనిచేస్తూ సమీపంలోని ఫుట్పాత్లపై నిద్రిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆశప్పతో పాటు కార్మికుడిగా పని చేస్తున్న నాగేంద్ర కూడా అదే ఫుట్పాత్పై నిద్రిస్తుంటాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం 200 రూపాయల విషయంలో శుక్రవారం రాత్రి ఆశప్ప, నాగేంద్ర మధ్య స్వల్ప వివాదం తలెత్తింది. దీంతో ఆశప్ప తలపై నాగేంద్ర ఇటుకతో మోదగా అక్కడికక్కడే చనిపోయాడు. అయితే శనివారం తెల్లవారు జామున గౌలిగూడ మహారాజ్ గంజ్ ప్రాంతానికి చెందిన శ్రవణ్కుమార్ ఓ వ్యక్తి రక్తం మడుగులో పడి పోయి ఉండగా గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పెట్రోలింగ్ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మరణించిన వ్యక్తిని ఉస్మానియాకు తరలించారు. అనంతరం ఇన్స్పెక్టర్ రవీందర్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. హత్యకు గురైన వ్యక్తి ఆశప్పగా గుర్తించారు. హత్య చేసిన నాగేంద్రను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
దోమలగూడ, ఏప్రిల్ 17: భార్యను తీసుకెళ్లి పిల్లలకు తల్లి ప్రేమను దూరం చేశాడన్న కోపాన్ని పెంచుకొని వరుసకు తమ్ముడయ్యే వ్యక్తిని అతి దారుణంగా హత్య చేసిన కేసును చిక్కడపల్లి పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను శనివారం సాయంత్రం మీడియా ఎదుట ప్రవేశవేశారు. అనంతరం చిక్కడపల్లి సబ్ డివిజన్ ఏసీపీ చల్లా శ్రీధర్ హత్య కేసు వివరాలను వెల్లడించారు. చిక్కడపల్లి సూర్యనగర్లో నివాసముండే సద్నామ్ సింగ్ వరుసకు సోదరుడయ్యే సర్వన్సింగ్ భార్యను తీసుకుపోయి పెండ్లి చేసుకున్నాడు. దీంతో పగ పెంచుకున్న సర్వన్ సింగ్ తన కుమారుడు, అల్లుడితో కలిసి సద్నామ్ సింగ్ కదలికలపై నిఘా పెట్టి ఈ నెల 1న హైదరాబాద్కు వచ్చాడు. వెంటనే నిషాంత్సింగ్, హర్షదీప్తో కలిసి సర్వన్ సింగ్ సద్నామ్ సింగ్ ఇంటికి వెళ్లి మెడ కోసి పరారయ్యారు. అయితే మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. పలు ఆధారాలు సేకరించి చిక్కడపల్లి డీఐ ప్రభాకర్ నేతృత్వంలోని ఓ బృందం పంజాబ్కు వెళ్లి నిందితులను పట్టుకొని హైదరాబాద్కు తీసుకొచ్చి రిమాండ్కు తరలించింది. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని ఏసీపీ శ్రీధర్ అభినందించారు.