మెహిదీపట్నం జూలై 29: ఆస్తి వివాదంలో సోదరుడు కిరాతకంగా కత్తితో సోదరి గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.. టోలిచౌకి ఆడమ్స్ కాలనీలో నివసించే ఫకీర్అలీకి ఐదుగురు కూతుళ్లు, ఐదుగురు కుమారులున్నారు. వీరికి పలు ప్రాంతాల్లో విలువైన ఆస్తులు ఉన్నాయి. ఆస్తి పంపకాల విషయంలో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఫకీర్అలీ ఆరో సంతానమైన ఆరీఫ్ అలీ, కూతురు రయిసా ఫాతిమా(42) మధ్య ఆస్తుల విషయంలో గొడవలు ఉన్నాయి. రయిసా ఫాతిమా న్యాయవాది కాగా, ఆరీఫ్ అలీ ఆడమ్స్ కాలనీలో టింబర్ డిపోను నిర్వహిస్తున్నాడు.
ఇదిలా ఉండగా, గురువారం మధ్యాహ్నం ఆరీఫ్ అలీ తన సోదరి రయిసాఫాతిమా ఇంటికి వెళ్లాడు. ఆస్తి పంపకాల విషయంలో గొడవ పడ్డాడు. క్షణికావేశంలో ఆరీఫ్ అలీ కూరగాయలు కోసే కత్తితో రయిసా ఫాతిమా గొంతుకోసి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు, శవపంచనామా అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.
న్యాయవాది ఫాతిమా హత్యను ఖండిస్తూ నాంపల్లి కోర్టులో విధులను శుక్రవారం బహిష్కరిస్తున్నట్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుశేఖర్ తెలిపారు. ఈ మేరకు గురువారం మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జికి వినతి పత్రం ఇచ్చామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ఉపాధ్యక్షుడు రాజ శేఖర్ గౌడ్, లక్ష్మీనారాయణ, సంయుక్త కార్యదర్శి జక్కుల లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.