ఖైరతాబాద్, సెప్టెంబర్ 3 : రాష్ట్రంలో అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మున్నూరుకాపు నిత్యాన్నదాన సత్రం ఆదివారం ప్రారంభం కానున్నది. రెండెకరాల విస్తీర్ణంలో వంద గదులు, కల్యాణ మండపంతో నిర్మితమైన ఈ సత్రాన్ని శ్రీలక్ష్మీనరసింహస్వామి మున్నూరుకాపు నిత్యాన్నదాన ట్రస్ట్ చైర్మన్, శాసనమండలి మాజీ వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రారంభిస్తారని ట్రస్ట్ సభ్యుడు శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం యాదాద్రి దివ్యక్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నదని తెలిపారు. తమ నిత్యాన్నదాన సత్రంలో అన్ని వర్గాల ప్రజలు వచ్చి సేదతీరవచ్చని, దైవదర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా నిత్యం అన్న ప్రసాదాన్ని పంపిణీ చేస్తామన్నారు. ప్రారంభోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో ట్రస్ట్ సభ్యులు కోలా ఆంజనేయులు, జల్లి మోహన్, పోతంశెట్టి అనిల్ కుమార్, సీఎం ప్రకాశ్, అలుగడ్డల రాజశేఖర్, ఎన్. రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.