Get together | ఖైరతాబాద్, మే 11 : అందరు విశ్రాంత ఉద్యోగులు.. ఉపాధ్యాయులు.. వ్యాపారులే. ఏడు పదుల వయస్సులో ఒక చోటకు చేరారు. మనవళ్లు… మనవరాండ్లతో వచ్చిన ఆ పూర్వ విద్యార్థులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఆదివారం సోమాజిగూడలోని ఓ హోటల్లో నల్గొండ జిల్లాలోని మల్టీపర్పస్ హైస్కూల్ 1970 బ్యాచ్కు చెందిన 12వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం వేడుకగా సాగింది.
సుమారు 55 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారందరూ ఆరు పదుల వయస్సు దాటిన వారే. వయసును మరిచి అరేయ్ ఎలా ఉన్నావురా అంటూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. చిన్నప్పటి రోజులు, గురువులు, వారి బోధనలను గుర్తు చేసుకున్నారు. అప్పటి చదువులకు ఇప్పటికీ చాలా తేడా ఉందని, నాడు గురువులను గౌరవించుకునేవారంటూ విశ్రాంత పోస్టల్ ఉద్యోగి వెంకన్న గుర్తు చేశారు. నాటి గురువులు నేర్పిన చదువు, సంస్కారం వల్లే తాను ఉన్నత స్థానాలకు చేరకున్నానని మరో పూర్వ విద్యార్ధి వినోద్ అన్నారు.
ఏ సెక్షన్ నుంచి జీ సెక్షన్ వరకు సుమారు 400 మంది విద్యార్థులుండే వారని, ప్రస్తుతం 81 మంది మాత్రమే వచ్చారంటూ వ్యాపారి మంచుకొండ ప్రకాశం విచారం వ్యక్తం చేశారు. చదువు, ఉద్యోగం, పిల్లలు, వారి పెంపకం, వివాహాలు ఇలా క్షణం తీరిక లేకుండా గడిపామని, అన్ని బాధ్యతలు తీరిన ఈ వయస్సు ఇక నుంచైనా ఒకరినొకరు అందుబాటులో ఉందామని అభిప్రాయపడ్డారు. వెంటనే ఓ వాట్సాప్ గ్రూప్ను తయారు చేసి ప్రతి ఏడాది ఈ వేడుకను నిర్వహించకుందామంటూ తీర్మానించారు.