యుద్ధ ప్రాతిపదికన వైకుంఠధామం పనులు
ఆగస్టులో అందుబాటులోకి ‘ముక్తి ఘాట్’
దేశంలో ఎక్కడ లేని విధంగా తొలిసారి ఏర్పాటు..
ఫతుల్లాగూడలో 6.2 ఎకరాల్లో అత్యాధునిక శ్మశాన వాటిక
గంగా జమునా తహజీబ్ కల్చర్ను చాటిచెప్పేలా నాగోల్లోని ఫతుల్లాగూడలో మూడు మతాలకు కలిపి వైకుంఠధామ నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. సర్వే నంబరు 24లోని 6.20 ఎకరాల విస్తీర్ణంలో 17.40 కోట్ల అంచనాతో హెచ్ఎండీఏ ఈ నిర్మాణ పనులు చేపడుతున్నది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాలకు చెందిన వ్యక్తుల మృతదేహాలకు అంత్యక్రియలు సాఫీగా జరిగేలా శ్మశాన వాటికలను ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వైకుంఠ ధామాన్ని నిర్మిస్తున్నారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారం, గ్రేటర్లో తొలిసారిగా హిందువులు, క్రైస్తవులు, ముస్లింల మృతదేహాలకు ఒకే చోట అంత్యక్రియలు నిర్వహించేలా వైకుంఠధామం ఏర్పాటు కావడం ఇదే కావడం విశేషం. కాగా, నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, రాబోయే ఆగస్టు నాటికల్లా వైకుంఠ ధామాన్ని వినియోగంలోకి తీసుకువస్తామని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
ప్రత్యేకతలు ఇవే…
ఎల్భీనగర్ నియోజకవర్గం ఫతుల్లాగూడలో ఆరు ఎకరాల్లో ముక్తి ఘాట్ పేరిట ఈ పనులు జరుగుతున్నాయి. ముక్తి ఘాట్లో 20 శాతం మాత్రమే నిర్మాణాలుంటాయి. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారం, మిగతాదంతా పచ్చదనమే. ప్రతి మతానికి రెండెకరాల చొప్పున స్థలం కేటాయింపు. వేర్వేరుగా హిందూ, ముస్లిం, క్రైస్తవ సంప్రదాయాల్లో అంత్యక్రియలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతే కాకుండా కలపను కాల్చడం, లోపల బ్యాండ్ నిషిద్ధం. ఆస్తికలను భద్రపరుచుకునే సౌకర్యం, ఒక్కో మతానికి రెండు చొప్పున ఆరు ఫ్రీజర్లు, మృతదేహాల తరలింపునకు ప్రత్యేక వాహనాలు సమకూర్చనున్నారు. అద్దెకు ఉండే వారు మరణిస్తే యజమానులు ఇంటికి రానివ్వకపోతే ఇక్కడ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడో ఉండి కూడా అంత్యక్రియలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించనున్నారు. పూర్తిగా సౌర విద్యుత్ వినియోగం, ప్రత్యేకంగా సోలార్ ప్లాంట్, ఘాట్ చుట్టూ 40 అడుగుల చెట్లు కనువిందు చేయనున్నాయి. స్నానపు, విశ్రాంతి గదుల్లో నీటిని పునర్వినియోగించుకునేలా 0.25 ఎంఎల్డీ మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నారు. సేద తీరేలా ఉద్యానం, చూడగానే ఆకట్టుకునేలా ల్యాండ్ స్కేపింగ్, అలంకరణ, పూల మొక్కలు ఏర్పాటు చేసి పరిసరాలను అందంగా తీర్చిదిద్దనున్నారు. ఈ ముక్తిఘాట్కు వెళ్లేందుకు వీలుగా 40 ఫీట్ల బీటీ రోడ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మూడు మతాలకు చెందిన శ్మశాన వాటికలకు వెళ్లే ప్రవేశ ద్వారాలను విడివిడిగా ఏర్పాటు చేస్తూ ఒక్కోదానికి మధ్య ప్రహరి గోడ నిర్మించనున్నారు.