చాదర్ఘాట్, ఆగస్టు 19: బీబీకా ఆలం ఊరేగింపు ప్రశాంతంగా నిర్వహించేలా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చాదర్ఘాట్ వద్ద ఉన్న ప్రత్యేక ప్రార్థన కేంద్రంలో ఆలంలను నిమజ్జనం చేయడంతో ఊరేగింపు పూర్తవుతుంది. చాదర్ఘాట్లోని నిమజ్జన ప్రార్థన స్థలం వద్ద నాలుగంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసినట్లు చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్ సతీశ్ తెలిపారు. డబీర్పురాలోని అషూర్ఖానా నుంచి బీబీకా ఆలం ఊరేగింపుగా మొదలై.. పాతబస్తీలోని వివిధ ప్రాంతాల మీదుగా రాత్రి ఏడు గంటల సమయంలో చాదర్ఘాట్ నిమజ్జన కేంద్రానికి చేరుకుంటుందని తెలిపారు. బందోబస్తు నేపథ్యంలో నిర్వహించిన సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్, ఏసీపీ దేవేందర్, ఇన్స్పెక్టర్ పి.సతీశ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
సిటీబ్యూరో : మొహర్రం సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. బీబీ కా ఆలం ర్యాలీ నిర్వహిస్తుండగా, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే, సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని పేర్కొన్నారు.
ఈనెల 20న ముస్లిం సోదరులు పవిత్రంగా జరుపుకొనే మొహర్రం పర్వదినానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ మహమ్మద్ సలీమ్ అన్నారు. గురువారం బీబీ కా ఆలం వక్ఫ్బోర్డు సభ్యులు, అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. ప్రార్థనా స్థలాల వద్ద ఎటువంటి లోటుపాట్లు లేకుండా జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు.