సిటీబ్యూరో, జూలై 31(నమస్తే తెలంగాణ): నిలోఫర్ దవాఖానలో ఏర్పాటు చేసిన మదర్ మిల్క్ బ్యాంక్ శిశువుల పాలిట అమృతదాయినిగా మారింది. 2017లో ధాత్రీ ఫౌండేషన్ సహకారంతో పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ మదర్ మిల్క్బ్యాంక్కు విశేష ఆదరణ లభిస్తున్నది. ప్రతిరోజూ నిలోఫర్లో 25నుంచి 30ప్రసవాలు జరుగుతుంటాయి. వీరిలో కొంత మంది తల్లులకు కొన్ని కారణాల వల్ల బిడ్డకు పాలు పట్టే అవకాశం ఉండదు. మరికొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ప్రీ మెచ్చూరిటీ బేబీస్, అండర్ వెయిట్ బేబీస్ను చికిత్స కోసం ప్రత్యేక వార్డుల్లో ఉంచాల్సి ఉంటుంది. ఇలాంటి శిశువులతో పాటు తల్లులకు దూరంగా ఉన్న శిశువులకు మిల్క్బ్యాంక్ ద్వారా సేకరించిన తల్లిపాలను అందిస్తున్నారు. ప్రతిరోజూ కనీసం 30నుంచి 40మంది శిశువులకు మిల్క్బ్యాంక్ ద్వారా తల్లిపాలను అందిస్తున్నట్లు నిలోఫర్ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఎన్ఐసీయూ, ఎస్ఎన్సీఐయూ వార్డుల్లో ఉన్న శిశువులకు మదర్ మిల్క్ బ్యాంక్ ద్వారా తల్లిపాలను అందిస్తున్నారు.
నిలోఫర్లో కొనసాగుతున్న తల్లిపాల నిధిలో సుమారు 250నుంచి 300మంది శిశువులకు సరిపడా పాలను నిలువ చేసే సామర్థ్యం ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.సాధారణంగా మహిళల నుంచి సేకరించిన చనుపాలను ముందుగా పరీక్షిస్తారు. అనంతరం పాలలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా యంత్రాల ద్వారా శుద్ధిచేసి, ‘పాశ్చరైజ్'(శీతలీకరణం) చేస్తారు. ఈ విధంగా శుద్ధిచేసిన పాలను తల్లి శరీర ఉష్ణోగ్రత వద్ద నిలువ చేస్తారు. ఏ రోజు సేకరించిన పాలు అదే రోజు సరఫరా చేస్తారు. రోజుల తరబడి నిల్వ చేయరు.
బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టాలి. కొంత మంది బిడ్డ పుట్టిన కొన్ని గంటల వరకు తల్లివద్ద కాకుండా వేరుగా ఉంచుతారు. ఇది బిడ్డకు ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. ప్రసవం జరిగిన వెంటనే వచ్చే ముర్రపాలు చాలా శ్రేష్ఠమైనవి. వీటిలో జీవిత కాలానికి సరిపడా ఇమ్యూనిటీ ఉంటుంది. శిశువుకు కచ్చితంగా రెండేండ్లు వచ్చే వరకు తల్లిపాలు పట్టాలి. నిలోఫర్లో ఏర్పాటు చేసిన మదర్ మిల్క్ బ్యాంక్ తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ శిశువులకు తల్లిపాలు పట్టడంలో ప్రోత్సహిస్తున్నది. పాలను మదర్ మిల్క్బ్యాంక్కు ఇచ్చే విధంగా తల్లులకు అవగాహన కల్పించడం వంటివి కూడా ఈ మిల్క్ సెంటర్ నిర్వహిస్తున్నది. – డాక్టర్ ఉషారాణి, చిన్నపిల్లల విభాగాధిపతి, నిలోఫర్ దవాఖాన
రక్తదానం మాదిరిగానే బిడ్డలకు జన్మనిచ్చిన తల్లులు ఇతర శిశువుల కోసం తమ పాలను దానం చేస్తున్నారు. నిలోఫర్లో ఏర్పాటు చేసిన మదర్ మిల్క్ బ్యాంక్కు ప్రతినెలా సుమారు 300నుంచి 350మంది వరకు తల్లులు పాలను దానం చేస్తున్నారు. సాధారణంగా ఆరోగ్యవంతమైన తల్లిలో రోజూ 250నుంచి 300మిల్లీ లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయి. ఇందులో రోజుకు 150నుంచి 200ఎం.ఎల్ పాలు మాత్రమే బిడ్డకు పట్టడం జరుగుతుందని, మిగిలిన పాలను మిల్క్బ్యాంక్కు ఇవ్వొచ్చంటున్నారు వైద్యనిపుణులు. ఈ క్రమంలోనే మదర్ మిల్క్ బ్యాంక్కు ప్రతిరోజూ పదుల సంఖ్యలో తల్లులు, దవాఖానకు చెందిన మహిళా ఉద్యోగులు సైతం అమ్మపాలను దానం చేస్తున్నారు.