మానవత్వం మరిచిన ఆ తల్లి జల్సాకోసం, కామవాంఛ తీర్చుకోవడానికి వచ్చిన ఓ మృగం చేతిలో మూడేండ్ల పసికందు తనువును చాలించాడు. తల్లి సహకారంతో ప్రియుడు బాలుడిని చిత్ర హింసలు పెట్టాడు. ఏం జరుగుతుందో తెలియక, ఊపిరిసలుపని వేదనతో అలమటించినా.. కనికరించని మృగం పిడిగుద్దులతో విరుచుకుపడి చివరకు చిన్ని ప్రాణాన్ని కడతేర్చింది. ఈ హృదయవిదారక సంఘటన ముషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుసుకున్నది.
ముషీరాబాద్, ఆగస్టు 30: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న ప్రియురాలి కొడుకును అత్యంత దారుణంగా హత్య చేసి తప్పించుకోజూసిన ప్రియుడు, అతడికి సహకరించిన చిన్నారితల్లిని ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కన్న తల్లి ప్రోద్బలంతో హత్యకు పథకం వేసిన ప్రియుడు మూడేళ్ల పసి బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి ఆపై గాయాలు కనిపించకుండా చిత్ర హింసలు పెట్టి, ఎవరికీ అనుమానం రాకుండా ఆసుపత్రిలో చేర్పించి సహజమరణంగా చిత్రీకరించే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయాడు. మంగళవారం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ రాజేశ్ చంద్ర ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన నాగలక్ష్మి, శివకుమార్ దంపతులు ముషీరాబాద్ మోహన్నగర్లో నివాసముంటున్నారు. శివకుమార్ పెయింటర్గా పనిచేస్తుండగా నాగలక్ష్మి గృహిణి. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అదే జిల్లాకు చెందిన ముస్త్యాల రవి ముషీరాబాద్ పార్శిగుట్టలో నివాసముంటూ సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో నాగలక్ష్మికి ముస్త్యాల రవితో వివాహేతర సంబంధం ఏర్పడింది. నాగలక్ష్మి పెద్ద కుమారుడు స్కూల్కు వెళ్తుండగా చిన్నకుమారు(3) తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, బాలుడిని ఎవరికీ అనుమానం రాకుండా అడ్డుతొలగించుకోవాలని పథకం వేశారు. ఆ తరువాత భర్తను ఊరికి తీసుకువెళ్లి ఆస్తులు అమ్మించి ఆ డబ్బుతో ఉడాయించాలని పథకం పన్నారు.
బాలుడిపై పిడిగుద్దులు
ఇదే క్రమంలో గత నెల 8న నాగలక్ష్మి తన భర్తను ఉద్యోగంలో చేర్పించడానికి హైటెక్ సిటీకి తీసుకువెళ్లింది. అంగన్వాడీకి వెళ్లిన చిన్న కుమాడిని ఇంటికి తీసురావాలని ఫోన్లో ప్రియుడికి సూచించింది. ఇదే అదునుగా భావించిన రవి బాలుడిని ఇంటికి తీసుకొని వచ్చి చిన్నపాటి రోకలిని మలద్వారంలో పెట్టి, తల, కడుపు భాగంలో పిడిగుద్దులు గుద్ది అపస్మారక స్థితికి చేరుకునేలా చేశాడు. ఆ తరువాత ఎవరికీ అనుమానం రాకుండా గాంధీ దవాఖానకు తీసుకువెళ్లాడు.
కుర్చీ మీదనుంచి పడ్డాడని..!
బాలుడు కుర్చీమీద నుంచి కిందపడ్డాడని, తలకు బలమైన గాయమైదని చెప్పి వైద్యం చేయమని కోరాడు. దీంతో వైద్యులు బాలుడిని పరిశీలించగా అప్పటికే మృతిచెందిఉన్నాడు. అనుమానంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు బాలుడి తండ్రి శివకుమార్ సైతం ఫిర్యాదు చేయడంతో పోలీసులు మృతదేహాన్ని మార్చురికీ తరలించి పోస్టుమార్టం చేయించారు. పోస్టుమార్టం నివేదికలో వైద్యులు అది సహజ మరణం కాదని, బలమైన గాయాలు అయినట్లు నిర్ధారించారు. దీంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్డడంతో అసలు విషయం వెల్లడైంది. ఈ మేరకు ముషీరాబాద్ పోలీసులు నిందితులిద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసు విచారణలో చురుకుగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని డీసీపీ అభినందించారు. ఈ మేరకు చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి పర్యవేక్షణలో ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ జాహంగీర్ యాదవ్ ఆధ్వర్యంలో ఎస్ఐ సురేందర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.