హయత్నగర్, సెప్టెంబర్ 28: నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహాయక సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు డైరెక్టర్లు అఖండ మెజార్టీతో గెలుపొందారు. మంగళవారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరిగిన సొసైటీ ఎన్నికలు హయత్నగర్లోని ఎస్వీ కన్వెన్షన్ హాల్లో జరిగాయి. మొత్తం 306 ఓట్లకు గాను 303 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులు పోటీపడగా నలుగురు విజయం సాధించారు. ఆరుగురు డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా వారిలో ఇద్దరు మహిళా డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మిగతా నలుగురు జనరల్ డైరెక్టర్ల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో గూడురు శ్రీధర్రెడ్డి 255 ఓట్లు, కోట్ల జలేందర్ రెడ్డి 243 ఓట్లు, చల్లా సురేందర్ రెడ్డి 232, రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి 219 ఓట్లు సాధించి విజయాన్ని కైవసం చేసుకున్నారు. విజయం సాధించిన నలుగురు డైరెక్టర్లను మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి, ఎన్నికల అధికారి జి.వి.హన్మంతరావు సన్మానించి ఎన్నిక పత్రాలను అందజేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు మదర్ డెయిరీ కార్యాలయంలో సంస్థ చైర్మన్ ఎన్నిక ఉంటుందని తెలిపారు.
నూతనంగా ఎన్నికైన పాలక వర్గ సభ్యుల పదవీ కాలాన్ని ఎన్నికల అధికారి జి.వి.హన్మంతరావు డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. వారిలో కోట్ల జలేందర్రెడ్డి, గూడురు శ్రీధర్రెడ్డి, అలివేలు ఐదేండ్ల పదవీకాలం, సురేందర్ రెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, జయశ్రీ నాలుగేండ్లు పదవీకాలం పదవుల్లో కొనసాగుతారని ప్రకటించారు.