సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ) ;సంసార చిచ్చు.. ప్రాణాలకే ముప్పు తెచ్చింది. ఆలుమగల మధ్య ఘర్షణతో హత్యలు, ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. మాతృదినోత్సవం రోజునే ముక్కుపచ్చలారని చిన్నారులతో పాటు ఓ తల్లి గొంతు మూగబోయింది. భర్త వేదింపులు తాళలేక కఠిన నిర్ణయమే తీసుకున్నారు. తాము చనిపోతే తమ పిల్లలు అనాథలుగా మారవద్దని అనుకున్నారు. తమతోపాటే పిల్లలను కూడా కానరాని లోకానికి తీసుకుపోవాలని నిర్ణయించుకున్నారు. పిల్లలతో కలిసి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా.. వేర్వేరు సంఘటనల్లో ముగ్గురు చిన్నారులతో పాటు ఓ తల్లి మృతి చెందగా.. మరో మాతృమూర్తి ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతున్నది. మరో చోట భార్యను గొంతు నులిమి భర్త హతమార్చగా.. ఇంకో చోట భార్యనే భర్తను దారుణంగా హతమార్చింది. ఈ సంఘటనలతో నగర శివారులోని పలు ప్రాంతాల్లో విషాధ చాయలు అలుముకున్నాయి. వివాహమైన పదేండ్లకు ఏకైక సంతానం కలిగింది. ఆ చిన్నారిని అల్లారు ముద్దుగా చూసుకుంటుండగా.. భర్తనుంచి అదనపు కట్నం వేదింపులు అధికమయ్యాయి. దీంతో వేదింపులు తాళలేక పది నెలల చిన్నారితో పాటు కానరాకి లోకానికి వెళ్లింది. ఈ హృదయ విధారక సంఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
పోలీసుల కథనం ప్రకారం..
రాంనగర్ బాకారంలో నివాసముండే విజయ వసంతకుమారి, విద్యాసాగర్ దంపతులకు పదేండ్ల కిందట వివాహమైంది. వీరికి పదినెలల (విద్యధరని) కూతురు ఉంది. నగరంలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న విద్యాసాగర్ వివాహం జరిగిన నాటి నుంచి కట్నం కోసం భార్యని వేధిస్తున్నాడు. ఈనెల 12వ తేదీన భార్య, కూతురును ఇంట్లోనే వదిలేసిన విద్యాసాగర్ తన తల్లిని సోదరి వాళ్ల ఇంట్లో వదిలి పెట్టి వస్తానని చెప్పివెళ్లి 13న అర్ధరాత్రి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటి లోపలి నుంచి గడియ పెట్టడంతో ఆందోళనకు గురైన విద్యాసాగర్ చుట్టుపక్కల వారు పోలీసుల సహకారంతో తలుపులు తెరిచి చూడగా భార్య విజయ వసంతకుమారి, కూతురు విద్యా ధరణి(10 నెలలు) మృతిచెంది కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీదవాఖానకు తరలించారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. తండ్రి నూకరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం విద్యాసాగర్ ముషీరాబాద్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ కేసును సీఐ జహంగీర్ యాదవ్ పర్యవేక్షణలో ఎస్సై ప్రసాద్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.
పిల్లలు అనాథలు కావద్దని..
భార్యాభర్తల మధ్యన జరిగిన ఓ చిన్నపాటి గొడవతో క్షణికావేశానికి గురైన ఓ తల్లి చనిపోవాలని నిర్ణయించుకున్నది. తాను చనిపోతే తన పిల్లలు అనాథలుగా మారిపోతారని భావించి కంటికి రెప్పలా చూసుకుంటున్న తన ఇద్దరు పిల్లలను టబ్బులో ముంచి చంపేసింది. అనంతరం తాను సైతం గుర్తు తెలియని విషం సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతున్నది. ఈ సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
సీఐ మహేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం, కుబ్యా తండాకు చెందిన నేనావబత్ భారతికి అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్తో 2020లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు విక్కి(ఏడాదిన్నర), చిన్న కుమరుడు (8 నెలలు)తో కలిసి మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని లలితానగర్లో నివాసముంటున్నారు. శనివారం ఉదయం భర్త శ్రీనివాస్ తల్లి ఇంటికి రావడంతో భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకున్నది. ఆదివారం ఉదయం భార్య తల్లిదండ్రులు కూడా ఇంటికి వచ్చారు. వీరు ఉండగానే భార్యాభర్తలు గొడవపడ్డారు. అనంతరం భర్త బయటకు వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్య భారతి తన ఇద్దరు పిల్లలను వాటర్ టబ్బులో ముంచి చంపేసింది. తాను సైతం గుర్తు తెలియని విషం తీసుకుని ఆత్మహత్యానికి పాల్పడింది. ఈ విషయాన్ని భర్తకు ఫోన్లో తెలిపింది. వెంటనే భర్త వచ్చి ఇద్దరు పిల్లలను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్యను చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతున్నది. పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్రెడ్డి తెలిపారు.