మన్సూరాబాద్, జనవరి 7: యువతుల ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధిస్తున్న నలుగురు యువకులను ఘట్కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో సీపీ డీఎస్ చౌహాన్ వివరాలు వెల్లడించారు. ఏపీ, గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు మండలం, కొర్రెపాడు గ్రామానికి చెందిన చొప్పర లక్ష్మీగణేశ్(19), మేడ ప్రదీప్ అలియాస్ పెతురు (19), తాడెపల్లి, అంజిరెడ్డికాలనీకి చెందిన బాలం సతీశ్ (20) విజయవాడలో వేర్వేరు హోటల్లో పని చేస్తున్నారు.
విజయవాడ, వైఎస్ఆర్ కాలనీకి చెందిన చావల దుర్గాప్రసాద్ (19) డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. బాలం సతీష్ పని చేసే ఫుడ్కోర్టులోనే దుర్గాప్రసాద్ సోదరుడు పని చేస్తుండగా, వీరు స్నేహితులయ్యారు. ఈ నలుగురు కలిసి సోషల్ మీడియా ద్వారా ఫోన్ నంబర్లు తీసుకుని యువతుల డీపీలను సేకరిస్తారు. అనంతరం తాము చెప్పిన ప్రదేశానికి రాకుంటే ఫొటో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తారు. ఇలా సేకరించిన నెంబర్లతో ఓ గ్రూప్ ఏర్పాటు చేస్తారు. లక్ష్మీగణేశ్ మూడు గ్రూప్లు, ప్రదీప్ ఒక గ్రూప్ను ఏర్పాటు చేశారు.
లక్ష్మీగణేశ్ ‘హ్యాకింగ్ స్కామ్’ పేరుతో ఏర్పటు చేసిన గ్రూప్ కోసం ప్రదీప్ నానమ్మ నెంబరును వాడుకున్నాడు. తన నెంబర్తో ‘ఎంటర్ ద డ్రాగన్’ పేరుతో రెండో గ్రూప్, శ్రీకాళహస్తికి చెందిన తేజ అనే యువకుడి ఫోన్ నెంబర్తో ‘XXX తేజ రౌడీ’ పేరుతో మూడో గ్రూప్ను ఏర్పాటు చేశాడు. ప్రదీప్ తన నెంబరుతో ‘కింగ్ ఈజ్ బ్యాక్’ పేరుతో క్రియేట్ చేశాడు. ఈ నాలుగు వాట్సప్ గ్రూప్ల్లో అసభ్య పదజాలంతో మెసేజ్లు పెట్టేవారు.
ఇలా ఘట్కేసర్ సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థుల నంబర్లను లక్ష్మీగణేశ్, మేడ ప్రదీప్, బాలం సతీశ్, దుర్గాప్రసాద్ తమ గ్రూప్ల్లో యాడ్ చేశారు. గత సంవత్సరం నవంబర్ 9 నుంచి సదరు యువతుల ఫొటోలను అసభ్యకరరీతిలో మార్ఫింగ్ చేసి గ్రూప్లో పెట్టడమే కాకుండా పరుష పదజాలంతో మెసేజ్లు పెట్టేవారు. తాము చెప్పిన ప్రాంతానికి రావాలని లొకేషన్ షేర్ చేసేవారు. సోషల్ మీడియాలో పెడతామని వారు చేస్తున్న హెచ్చరికలతో సదరు గ్రూప్లను విద్యార్థులు బ్లాక్ చేశారు.
అయినా వేరే నంబర్ల నుంచి మెసేజ్లు పెడుతుండటంతో ఈ విషయాన్ని వార్డెన్కు తెలియజేశారు. ఈ నెల 4న హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘట్కేసర్ పోలీసులు, ఎస్వోటీ, సైబర్క్రైమ్ వింగ్ పోలీసులు రంగంలోకి దిగి నలుగురు యవకులు లక్ష్మీగణేశ్, మేడ ప్రదీప్, బాలం సతీశ్, దుర్గాప్రసాద్ను ఘట్కేసర్ బస్టాండ్ వద్ద శనివారం అరెస్ట్ చేసి, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ రక్షిత కె మూర్తి, ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్, మల్కాజిగిరి ఏసీపీ పి. నరేశ్రెడ్డి, ఘట్కేసర్ సీఐ వి. అశోక్రెడ్డి పాల్గొన్నారు.