గోల్నాక : రాజ్యసభ వేధికగా ప్రధాని మోదీ, బీజేపీ నిజస్వరూపం బయటపడిందని, తెలంగాణపై కక్ష సాధింపుగా మోదీ వ్యవహరిస్తున్నారని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.
కార్పొరేటర్లు దూసరి లావణ్యశ్రీనివాస్ గౌడ్, విజయ్కుమార్గౌడ్, టీఆర్ఎస్ నియోజకవర్గం నాయకులు బత్తుల శిరీష, దిడ్డి రాంబాబుతో పాటు సుమారు మూడు వందల మంది టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలసి నల్లబ్యాడ్జీలు ధరించి కాచిగూడ డివిజన్ చప్పల్ బజర్ నుంచి అంబర్పేట శ్రీరమణ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం శ్రీరమణ చౌరస్తా వద్ద బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని మోదీ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా శ్రీరమణ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడారు..యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో తెలంగాణ సమాజం బీజేపీని ఎప్పటికీ క్షమించదన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అంబర్పేట నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని ఆయన అన్నారు. తెలంగాణపై దాడికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు.
తెలంగాణను కానీ, కేసీఆర్ను కానీ ఎవరైన ఏమైనా అంటే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సిద్ధార్థ్ ముదిరాజ్, చంద్రమోహన్, భీష్మ, మేడి ప్రసాద్, కె.శ్రీనుతో పాటు వందలాది మంది టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.