చిక్కడపల్లి, జనవరి 28: జాతీయ బ్యాంకులను కేంద్రంలోని మోదీ సర్కార్ నిర్వీర్యం చేస్తున్నదని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం ఆరోపించారు. బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో శనివారం యూనియన్ బ్యాంకు అవార్డు ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర 2వ త్రై వార్షిక మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన సీహెచ్.వెంకటాచలం మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి, ప్రజల ఆర్థిక సాధికారతకు సహాయపడుతున్న జాతీయ బ్యాంకులను నేడు కేంద్ర ప్రభుత్వం ధ్వంసం చేస్తున్నదని ధ్వజమెత్తారు.
బ్యాంకులు, బీమా, బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ ఉద్యోగులు పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన అసరం ఉన్నదని తెలిపారు. యూనియన్ అధ్యక్షుడు టి.రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రధాన కార్యదర్శి సుమాద్ ఖాన్, ఆహ్వాన సంఘం చైర్మన్ బి.ఎన్.ఆర్ మోహన్ రెడ్డి, యూనియన్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ సురేశ్ చంద్ర టెలి, ఏఐబీఈఏ జాతీయ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు, అఖిల భారత యూనియన్ బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్.శంకర్, చైర్మన్ విన్సెంట్ డిసౌజా, ఏపీ యూనియన్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వి.ఉదయ్కుమార్, యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్లు పి.సత్యం, సీఎస్.జననీ పాల్గొన్నారు.