సైదాబాద్, జనవరి 18 : కాలనీవాసుల డ్రైనేజీ, తాగునీటి ఇబ్బందులను పూర్తిస్థాయిలో పరిష్కరించాల్సిన బాధ్యత జలమండలి అధికారులదేనని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బలాల అన్నారు. మంగళవారం సాయంత్రం ఎల్సీహెచ్ కాలనీలో రూ.42లక్షల వ్యయంతో చేపట్టిన డ్రైనేజీ ఆధునీకరణ పనులను ఆయన ఆస్మాన్ఘడ్ జలమండలి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ ఇబ్బందులను పూర్తిస్థాయిలో తొలగించటానికి రూ.5 కోట్లు కేటాయించటం జరిగిందని, వాటితో పలు ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. సైదాబాద్లో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించటానికి రూ.75 లక్షలు కేటాయించామని, అందులో భాగంగా ఎల్సీహెచ్ కాలనీలో రూ.42 లక్షలతో చేపట్టిన డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయన్నారు. కాలనీలో పురాతన పైపులైన్ మూలంగా తరుచూ డ్రైనేజీ పొంగి ఇండ్లలోకి రావటంతో కాలనీవాసులు అనేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తన దృష్టికి తీసుకుని రావటంతో కొత్త అండర్గ్రౌండ్ పైపులైన్ నిర్మాణ కోసం నిధులను కేటాయించానని ఆయన తెలిపారు. కాలనీలో ఇండ్ల ఆవరణలో ఉన్న తాగునీటి పైపులైన్లను తొలగించటానికి, కొత్తవి నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధంచేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ, తాగునీటి పైపులైన్ల నిర్మాణ పనులను పూర్తికాగానే, కాలనీ వాసులందరూ కనెక్షన్లు తీసుకోవాలని, వాటి ప్రక్రియ ముగిసిన వెంటనే రోడ్ల నిర్మాణ పనులను చేపడుతామని తెలిపారు. కార్యక్రమంలో ఆస్మాన్ఘడ్ జలమండలి డీజీఎం షీలారాణి, సైదాబాద్ జలమండలి మేనేజర్ శ్రవణ్, వర్క్ఇన్స్పెక్టర్ మనోహర్, ఎల్సీహెచ్ కాలనీవాసులు పాల్గొన్నారు.