దుండిగల్, జూన్ 3 : వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశప్రజలు కోరుకుంటున్నారని ప్రభుత్వ విప్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని దుండిగల్ మున్సిపాలిటీ, బౌరంపేట్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనంలో శనివారం పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్రెడ్డి అధ్యక్షతన జరిగిన ‘రైతు దినోత్సవం’ వేడుకలకు వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాకముందు ఎండాకాలంలో పశువులకు తాగునీరు దొరకేది కాదన్నారు.
కానీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి సాగు, తాగునీటికి ఢోకా లేకుండా చేశాడన్నారు. ఇపుడు ఎండాకాలంలోనూ చెరువులు మత్తడులు దుంకుతున్నాయంటే సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమన్నారు. ఉమ్మడి కుత్బుల్లాపూర్ మండలంలో ఇప్పటి వరకు 3741 మంది రైతులకు రూ.14కోట్ల95వేల సాయం అందిందన్నారు. 50 కుటుంబాలకు రూ.2 కోట్ల 50లక్షల బీమా డబ్బులు అందించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల స్థాయిలో ఆదర్శంగా నిలిచిన ఐదుగురు రైతులను ఉత్తమ రైతులుగా గుర్తించి సత్కరించారు.
అనంతరం ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, ఎమ్మెల్యే వివేకానంద్ రైతులకు స్వయంగా అన్నం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో నిజాంపేట్ మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి, కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్, మండల రైతు బంధు సమితి కన్వీనర్ గోపాల్రెడ్డి, దూలపల్లి పీఏసీఎస్ చైర్మన్ గరిష నరేందర్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్రెడ్డి, మాజీ ఎంపీపీ చినంగి వెంకటేశం, మేడ్చల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రవీందర్యాదవ్, నిజాంపేట్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఆగంపాండు ముదిరాజు, గండిమైసమ్మ-దుండిగల్ తాసీల్దార్ పద్మప్రియ, దుండిగల్ మున్సిపాలిటీ కమిషనర్ సత్యనారాయణరావు, వ్యవసాయాధికారి మాధవరెడ్డి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పీఏసీఎస్ వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, బీఆర్ఎస్ నేతలు, రైతులు పాల్గొన్నారు.