దుండిగల్/జీడిమెట్ల, ఏప్రిల్ 10: దేశ రాజకీయాలను మలుపు తిప్పే సత్తా గులాబీ జెండాకు మాత్రమే ఉందని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ ఇన్చార్జి, ఎమ్మెల్సీ డా.పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఐడీపీఎల్లోని వైఎంఎస్ ఫంక్షన్ హాల్లో రంగారెడ్డినగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి సోమవారం ఆయన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్తో కలిసి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారం కోసం బీజేపీ అడ్డదారులు తొక్కుతూ అసత్యప్రచారాల తెరతీసిందన్నారు. రాష్ట్ర పర్యటనలో ప్రధాని మోదీ పచ్చి అబద్దాలు మాట్లాడారని, ఇక్కడి అభివృద్ధిని చూసి అక్కసుతో బీజేపీ నాయకులు పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టాలని కార్యాకర్తలకు పిలుపునిచ్చారు. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. అలాగే గండిపేట మండలం నార్సింగి మున్సిపాలిటీలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సమక్షంలో 600 మందితో కౌన్సిలర్ పత్తి ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అబిడ్స్లోని సందర్శిని హోటల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళానికి హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్, మూసాపేట డివిజన్ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
ప్రధాని మోదీ దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతున్నారని రాష్ట్ర రైతుబంధు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, ఆత్మీయ సమ్మేళనాల మేడ్చల్ జిల్లా కో-ఆర్డినేటర్ డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి దుయ్యబట్టారు. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ జెండా ఎగురవేసి హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డినగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం ఐడీపీఎల్లోని వైఎంఎస్ ఫంక్షన్ హాల్లో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో అధికారం సాధించేందుకు బీజేపీ అడ్డదారులు తొక్కుతూ, అసత్య ప్రచారాలకు తెరతీసిందన్నారు. దేశ రాజకీయాలను మలుపుతిప్పే సత్తా కేవలం గులాబీ జెండాకు మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రాష్ట్ర పర్యటనలో ప్రధానమంత్రి మోదీ పచ్చి అబద్దాలు మట్లాడారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంటే బీజేపీ నేతలు అక్కసుతో మాట్లాడుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తుండటంతో బీజేపీ అనేక కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. వీటిని ఎప్పటికప్పుడు కార్యకర్తలు ఎండగట్టాలని దిశానిర్ధేశం చేశారు.
మళ్లీ జెండా ఎగురవేస్తాం: ఎమ్మెల్యే వివేకానంద్
రానున్న ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ అన్నారు. కార్యకర్తల శ్రమ, పట్టుదలతోనే ఇది సాధ్యమని చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజలను వేధించే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్నదన్నారు. దేశంలోనే తెలంగాణ నంబర్వన్గా నిలిచిందని, యావత్తు దేశాల చూపు తెలంగాణ వైపు ఉన్నదన్నారు. దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రజాదరణను ఓర్వలేని కేంద్ర ప్రభుత్వం న్యాయంగా మనకు రావాల్సిన నిధులను ఇవ్వకుండా ఉత్తరాది రాష్ర్టాలకు కేటాయిస్తుందని మండిపడ్డారు. అయినా రాష్ట్ర బీజేపీ నాయకులు విషప్రచారం చేస్తున్నారని, దీనిని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో బీజేపీ నాయకుల ఆశలు కలలుగానే మిగిలిపోతాయని ఎద్దేవా చేశారు.
అభివృద్ధికి చిరునామా కూకట్పల్లి
కూకట్పల్లి నియోజకవర్గాన్ని నాలుగున్నరేండ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, అభివృద్ధికి చిరునామాగా మార్చామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం మూసాపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ డివిజన్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉన్నదన్నారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ అమలవుతున్నాయో ప్రధానమంత్రి మోదీ చెప్పాలన్నారు. దేశ సంపదను కార్పొరేట్ పెట్టుబడి దారులకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. మూసాపేట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సొంత నిధులు రూ. 25లక్షలతో రాజగోపురం, డివిజన్ పరిధిలో రెండెకరాల స్థలంలో రూ. 2కోట్లతో పాఠశాల ఏర్పాటుకు ప్రణళికలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. పేదల డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి ఐడీపీఎల్ కేంద్ర ప్రభుత్వ భూముల్లో 400 ఎకరాలు భూములు కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అల్విన్కాలనీ డివిజన్ కార్పొరేటర్ వెంకటేశ్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు బాబూరావు, నరేంద్ర ఆచార్య, కోఆర్డినేటర్ సతీశ్ అరోరా, మాజీ కౌన్సిలర్ సి.హెచ్ సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రభాకర్గౌడ్, సీనియర్ నాయకులు పెంటయ్య, టి.అశోక్, గోపాల్, బి.నర్సింగ్రావు, సత్యం, చంద్రశేఖర్, రవీందర్, హరినాథ్, ప్రధాన కార్యదర్శి తిరుపతి, రాజ్కుమార్, రమేశ్ యాదవ్, సుందర్, భిక్షపతి, నర్సింగ్రావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.