బాలానగర్, ఏప్రిల్ 9 : తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? రాష్ట్ర ప్రాజెక్ట్లకు జాతీయహోదా కల్పించిందా? రాష్ర్టానికి మెడికల్ కాలేజీల కేటాయింపులో కూడా వివక్ష చూపిస్తున్నది. వందే భారత్రైలును ఎన్నిసార్లు ప్రారంభిస్తారని బీఆర్ఎస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఆదివారం బాలానగర్లోని తెలంగాణ గార్డెన్లో ఏర్పాటు చేసిన బాలానగర్, ఫతేనగర్ డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతికి అనేక రైళ్లు నడుస్తుండగా కొత్తగా..ఒకే రైలును దేశంలో ఎన్ని సార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. బీబీనగర్లో రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్ ఏర్పాటుకు స్థలం కేటాయించి, భవనం నిర్మించి ఇస్తే ప్రధాని మోదీ ప్రారంభోత్సవాన్ని జాప్యం చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో 150 మెడికల్ కాలేజీలు, 150 నర్సింగ్ కాలేజీలు, 150 పారా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం అనుమతించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రూ. 45 వేల కోట్ల నిధులతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా 2700 గ్రామాలకు తీగునీటి వసతిని కల్పించిన సీఎం కేసీఆర్ ఆ పథకాన్ని ఒకేసారి ప్రారంభించారని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన మెట్రో ట్రెయిన్ పథకాన్ని, ఔటర్ రింగ్రోడ్డును తామే నిర్మించామని ప్రధాని మోదీ చెప్పుకోవడం విచారకరమన్నారు. 2014, 2018లలో సీఎం కేసీఆర్ పనితీరు పట్ల ప్రజలు విశ్వాసం చూపించి రెండోసారి భారీ మెజార్టీతో గెలిపించారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆదరించి ప్రజలు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎంతో క్రమ శిక్షణతో కార్యకర్తలను, పార్టీని ముందుకు నడిపిస్తూ పార్టీ ప్రతిష్టను పెంచడంలో కీలక పాత్ర పోషించడం అభినందనీయమన్నారు. అంతకు ముందు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
డబుల్ ఇండ్లకు ఐడీపీఎల్ భూములు కేటాయించాలి
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి నిరుపేద ప్రజల పట్ల ప్రేమ ఉంటే డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి ఐడీపీఎల్ భూములు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కును కోల్పోయిందన్నారు. తెలంగాణకు లాభం చేకూర్చే పథకాలను ప్రవేశ పెట్టడంలో కేంద్రం విఫలమైందన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో కోట్లాది రూపాయల నిధులు కేటాయించి రికార్డు స్థాయిలో అభివృద్ధిని సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి, ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్, బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి, కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, బాలానగర్ మాజీ కార్పొరేటర్ కాండూరి నరేంద్రాచార్య, బీఆర్ఎస్ నాయకుడు మందడి సుధాకర్రెడ్డి, అంబటి సునిల్కుమార్, నరేందర్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.