‘బీఆర్ఎస్కు కార్యకర్తలే శ్రీరామరక్ష.. బలం.. బలగం మీరే.. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా నిలిచి.. సంక్షేమ పథకాలను ఇంటింటికి చేర్చడంలో కీలక బాధ్యతలు నిర్వర్తించాలి.. సైనికుల్లా పనిచేసి.. మూడో సారి అఖండ మెజార్టీతో హ్యాట్రిక్ కొట్టేలా కృషి చేయాలి’ అని ముఖ్యనేతలు శ్రేణులకు పిలుపునిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. శుక్రవారం వివేకానందనగర్, చైతన్యపురిలో జరిగిన సమ్మేళనాలకు రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యేలు గాంధీ, సుధీర్రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
మియాపూర్ , మార్చి 24 : కార్యకర్తల భుజస్కందాలపైనే పార్టీ పురోగతి దిశగా సాగుతుందని.. నియోజకవర్గంలో అలాంటి కార్యకర్తలే తన బలం.. బలగమని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. పార్టీ కార్యకర్తలను కండ్లలో పెట్టుకుని చూసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వివేకానందనగర్ డివిజన్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం గాంధీ నివాసంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పార్టీ శ్రేణలు పని చేయాలని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడంలో కీలక బాధ్యతను నిర్వర్తించాలని గాంధీ కోరారు. నియోజకవర్గంలో రూ.8500 కోట్లతో విస్తృతమైన అభివృద్ధి పనులను చేపట్టామని, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాళ్లు, చెరువుల సుందరీకరణ, లింక్ రహదారుల అభివృద్ధి సహా మరెన్నో మౌలిక వసతులను కల్పించామన్నారు.
ప్రజా సంక్షేమమే పరమావధిగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి తాను సేవలను అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గంలోనే ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కోట్లాది రూపాయలు వెచ్చించి ఫ్లై ఓవర్, అండర్ పాస్లను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వారిని చైతన్య పరచాలని కోరారు. ప్రభుత్వ పథకాల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు, భవిష్యత్ ఉంటుందన్నారు. సైనికుల్లా పని చేస్తూ రాబోయే ఎన్నికల్లో పార్టీ అఖండ మెజార్టీతో హ్యాట్రిక్ సాధించేలా కృషి చేయాలని సూచించారు. నిత్యం ప్రజల మధ్యలో ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రోజాదేవి, రంగారావు, సంజీవరెడ్డి, భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు.
ఎల్బీనగర్, మార్చి 24 : నరేంద్రమోదీ పాలనలో దేశంలో అభివృద్ధి శూన్యమని రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. కులాల మతాల మధ్య చిచ్చుపెట్టి కేంద్రం పబ్బం గడుపుతున్నదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి అందరికీ మార్గదర్శకమని చెప్పారు. శుక్రవారం చైతన్యపురి డివిజన్ ఎలిమినేటి మాధవరెడ్డి కమ్యూనిటీ హాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా సుధీర్రెడ్డి ప్రత్యేక ప్రణాళికలతో అభివృద్ధి చేపడుతున్నారని కితాబిచ్చారు.
ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని రూ.3వేల కోట్లతో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ఎస్ఎన్డీపీ, ఎస్ఆర్డీపీ పనులతో పాటు గడ్డిఅన్నారంలోని పండ్ల మార్కెట్ను నగర శివారు ప్రాంతానికి తరలించామని, అదే స్థానంలో రూ.1200 కోట్లతో టిమ్స్ ఆస్పత్రిని నిర్మిస్తున్నామని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ.120 కోట్లతో మంచినీరు, రూ.150 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులు చేపడుతున్నామని వివరించారు. ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఫలాలే బీఆర్ఎస్ను మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయని పేర్కొన్నారు. టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాపోలు సుధాకర్, చైతన్యపురి డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట మహేశ్ యాదవ్, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు తొంటి చంద్రశేఖర్రెడ్డి, బొగ్గారపు శరత్చంద్ర పాల్గొన్నారు.