సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): నగర వ్యాప్తంగా క్రిస్మస్ సంబురాలు జరిగాయి. ఏసుక్రీస్తు జన్మించిన రోజున నిర్వహించే క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాగా ఆయా చర్చిలకు పలువురు ప్రముఖులు హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చర్చిల ప్రాంగణంలో చిన్నారులు సందడిచేశారు.
ఈ సందర్భంగా ప్రత్యేకంగా క్రీస్తు గీతాలాపనలు నిర్వహించారు. బైబిల్ పఠనాన్ని గావించిన అనంతరం కేక్ కట్చేశారు. సికింద్రాబాద్లోని వెస్లీ, సెయింట్ మేరీ చర్చి, మియాపూర్లోని కల్వరిటెంపుల్, నారాయణగూడలోని బాప్టిస్ట్ చర్చి, చాపెల్ రోడ్డులోని సెంటినరీ మెథడిస్ట్ చర్చి, అబిడ్స్లోని సెయింట్ జార్జ్ చర్చిలతోపాటు ఆయా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
సుల్తాన్బజార్, డిసెంబర్ 25 : చాపెల్రోడ్లోని సెంటినరీ మెథడిస్ట్ తెలుగు చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిషఫ్ డాక్టర్ ఎంఏ డానియల్, చర్చి సెక్రటరీ బ్రదర్ కె.యేసుదాసు, కోశాధికారి సామ్ ఏ క్రిస్టఫర్, పాస్టర్లు రెవరెంట్ జీడీ అనీల్కుమార్, రెవరెంట్ ఎం.జోసెఫ్, వైఎం భాస్కర్, ఎం.జయపాల్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి, మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్గుప్తా, మాజీ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్లతో కలిసి ఆమె కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.